నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కరీంనగర్లో ఎస్ఎఫ్ఐ నాయకత్వంపై ఏబీవీపీ గూండాల దాడిని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎల్ మూర్తి, కార్యదర్శి టి నాగరాజు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రయివేటు విద్యాసంస్థ అనుమతి లేకుండా యూనిఫారామ్, పుస్తకాలు అమ్ముతుంటే ఆందోళన చేస్తున్న ఎస్ఎఫ్ఐ నాయకత్వంపై ఆ యాజమాన్యానికి మద్దతుగా ఏబీవీపీ నిలిచిందని తెలిపారు. ఎస్ఎఫ్ఐ నాయకత్వంపై ఏబీవీపీ గూండాలు దాడి చేశారని విమర్శించారు. కర్రలతో, బైక్ ”కీ”లతో దాడి చేసి ఎస్ఎఫ్ఐ నాయకతాన్ని గాయపర్చారని తెలిపారు. ఫీజులపై, విద్యార్థి సమస్యలపై పోరాడుతూ ప్రశ్నిస్తున్న ఎస్ఎఫ్ఐపై భౌతికంగా దాడి చేయడం పిరికిపంద చర్య అని పేర్కొన్నారు. చాతనైతే సమస్యలపై పోరాడాలి కానీ భౌతిక దాడులకు దిగడం సరైంది కాదని తెలిపారు. ఏబీవీపీ దాడిని, మేధావులు, ప్రజాస్వామికవాదులు, విద్యార్థిలోకం ఖండించాలని కోరారు.