ప్రశ్నిస్తే సంకెళ్లా?

Shackles if questioned?– విమర్శను సహించలేకపోతున్నారు
– జర్నలిస్టులు, హక్కుల కార్యకర్తలను తొక్కిపెడుతున్నారు : అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థల ఖండన
‘కేసుల్లో అభియోగాల నమోదులో జాప్యం జరగడం, అనేకమందిని నిర్దోషులుగా విడిచిపెట్టడం చూస్తుంటే తీవ్రవాద నిరోధక చట్టాన్ని ఏళ్ళ తరబడి విమర్శకుల నోళ్ళు మూయించడానికి వాడుతున్నట్లు అర్ధమవుతోంది. మాట్లాడాలనుకునేవారికి ఒళ్లు గగుర్పొడిచేలా సందేశం పంపడానికి, వేధింపులకు సాధనంగా ఉపయోగిస్తున్నారు. జర్నలిస్టులను, మానవ హక్కుల పరిరక్షకులను, ఇతర విమర్శకులను లక్ష్యంగా చేసుకోవడానికి యూఏపీఏను పదే పదే ప్రయోగిస్తున్నారు. ప్రశ్నను చెరబట్టేందుకు చట్టాలను దుర్వినియోగం చేస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. భారతదేశంలో నెలకొన్న ఈ దారుణమైన పరిస్థితులపట్ల అతర్జాతీయ సమాజం సైతం ఆందోళన చెందుతోంది.
న్యూఢిల్లీ : జర్నలిస్టులను, మానవ హక్కుల కార్యకర్తలను, సామాజిక కార్యకర్తలను, ప్రభుత్వాన్ని విమర్శించే వారి నోళ్ళను మూయించేందుకు భారత అధికారులు తీవ్రవాద నిరోధక చట్టాలను, ఆర్థిక నిబంధనలను, ఇతర చట్టాలను దుర్వినియోగం చేస్తున్నారంటూ అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు తీవ్రంగా విమర్శించాయి. హ్యూమన్‌ రైట్స్‌ వాచ్‌, అమ్నెస్టీ ఇంటర్నేషనల్‌, మరో 10 అంతర్జాతీయ హక్కుల గ్రూపులు ఈ మేరకు శుక్రవారం సంయుక్తంగా ఒక ప్రకటన జారీ చేశాయి. న్యూస్‌క్లిక్‌ కార్యాలయాలు, సిబ్బంది నివాసాలపై ఇటీవల దాడులు జరిగిన నేపథ్యంలో వీరి ప్రకటన వెలువడింది. 13ఏళ్ళ నాటి కేసులో రచయిత అరుంధతి రారును ప్రాసిక్యూట్‌ చేయడానికి ఢిల్లీ లెఫ్టినెంట్‌ జనరల్‌ ఇటీవల అనుమతినివ్వడాన్ని కూడా ఆ ప్రకటన ప్రస్తావించింది. న్యూస్‌క్లిక్‌పై జరిగిన దాడులను నిరసిస్తూ జరిగిన నిరసనల్లో అరుంధతి రారు పాల్గొనడమే ఇందుకు కారణమై వుండవచ్చని మానవ హక్కుల గ్రూపులు భావిస్తున్నాయి. సామాజిక కార్యకర్త తీస్తా సెత్వలాద్‌ను లక్ష్యంగా చేసుకోవడం, బీబీసీ ఇండియా కార్యాలయాలపై ఆదాయపన్ను అధికారుల దాడులు, ఢిల్లీ అల్లర్ల కేసులో విద్యార్ధి కార్యకర్తలపై రాజకీయ దురుద్దేశపూరితమైన అభియోగాలు మోపడం, కాశ్మీరీ జర్నలిస్టులు ఫహద్‌ షా, సజద్‌ గుల్‌, కాశ్మీరీ మానవ హక్కుల కార్యకర్త ఖుర్రం పర్వేజ్‌లను అరెస్టు చేసి నిర్బంధించడం, బీమా కొరెగావ్‌ కేసులో దళితులు, ఆదివాసీలు, బహుజన కార్యకర్తలపై నిర్బంధాన్ని కొనసాగించడం వంటి చర్యలను ఆ ప్రకటన ప్రముఖంగా ప్రస్తావించింది.
అణచివేత ఉధృతం : ”మానవ హక్కులను పరిరక్షించడంలో విఫలమైనందుకు బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించే న్యూస్‌క్లిక్‌పై దాడులు, అరెస్టులు ఈ క్రమంలో స్వతంత్ర జర్నలిస్టులను వేధించేందుకు, వారిని బెదిరించేందుకు అధికారులు చేపట్టిన తాజా ప్రయత్నాలు” అని ఆ ప్రకటన పేర్కొంది. రిపోర్టర్స్‌ వితౌట్‌ బోర్డర్స్‌, కమిటీ టు ప్రొటెక్ట్‌ జర్నలిస్ట్స్‌, ఫ్రంట్‌లైన్‌ డిఫెండర్స్‌, ఇంటర్నేషనల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ జర్నలిస్ట్స్‌, ఇంటర్నేషనల్‌ సర్వీస్‌ ఫర్‌ హ్యూమన్‌ రైట్స్‌, ఆసియన్‌ ఫోరమ్‌ ఫర్‌ హ్యూమన్‌ రైట్స్‌ అండ్‌ డెవల ప్‌మెంట్‌ (ఫోరమ్‌-ఆసియా) తదితర సంస్థలు ఈ ప్రకటనను జారీ చేశాయి.
యూఏపీఏ దుర్వినియోగం :”బూటకమైన తీవ్రవాదం, ఇతర క్రిమినల్‌ అభియోగాలపై వారు జర్నలిస్టులను అరెస్టు చేశారు. ఆర్థికపరమైన అవకతవకలు జరిగాయన్న ఆరోపణలతో విమర్శకులను, స్వతంత్ర వార్తా సంస్థలను లక్ష్యంగా పెట్టుకుం టున్నారు. అలాగే, వారు తీవ్రవాద నిరోధక చట్టాన్ని, జాతీయ భద్రతా చట్టాలను, విదేశీ నిధుల చట్టాలను, ఆదాయపన్ను నిబంధనలను ఉపయోగి0చి మానవ హక్కుల కార్యకర్తలను, శాంతియుత ఆందోళనకా రులను లక్ష్యంగా చేసుకుని, వేధిస్తున్నారు.” అని ఆ ప్రకటన పేర్కొంది. యూఏపీఏను ఉపయోగించడం పెరిగినప్పటికీ, 2016 నుంచి 2019 వరకు ఈ చట్టం కింద నమోదైన కేసుల్లో కేవలం 2.2శాతం కేసుల్లో మాత్రమే నేర నిరూపణ జరిగిందని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ చేసిన విశ్లేషణను కూడా ఆ ప్రకటన ఉదహరించింది. ”అంతర్జాతీయ మానవ హక్కుల ప్రమాణాలకు అనుగుణం గా అక్రమ కార్యకలాపాల నిరోధక చట్టాన్ని ప్రభుత్వం సవరించాలి. ఆ సవరణ జరిగేంతవరకు, విమర్శకులను లక్ష్యంగా చేసుకోవడానికి ప్రభుత్వం దీన్ని ఉపయోగించుకోవడం ఆపాలి” అని ఆ గ్రూపులు పేర్కొన్నాయి.
2014లో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి, మీడియా, పౌర సమాజంపై ప్రభుత్వ దాడులు, అణచివేత చర్యలు ఎక్కువైపోయాయి. రాజకీయ దురుద్దేశ్యంతోమోపిన కేసుల్లో అరెస్టు చేసిన జర్నలిస్టులు, మానవ హక్కుల కార్యకర్తలు, సమాజిక కార్యకర్తలు, విమర్శకులు అందరినీ తక్షణమే, బేషరతుగా విడుదల చేయాలని పలు ప్రపంచ మానవ హక్కుల సంస్థలు కోరాయి. వారిపై మోపిన అభియోగాలన్నింటినీ ఉపసంహరించాలని, క్రిమినల్‌ ప్రాసిక్యూషన్‌ ద్వారా వారిని బెదిరించడం, వేధించడం, నిరోధించడం ఆపాలని కోరాయి
పుర్కాయస్థ, అమిత్‌ల పిటిషన్లను తోసిపుచ్చిన ఢిల్లీ హైకోర్టు
న్యూఢిల్లీ : అక్రమ కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ) నిబంధనల కింద నమోదు చేసిన కేసులో తమను అరెస్టు చేయడాన్ని, పోలీసు కస్టడీకి ఇవ్వడాన్ని సవాలు చేస్తూ న్యూస్‌క్లిక్‌ వ్యవస్థాపకుడు ప్రబీర్‌ పుర్కాయస్థ, హెచ్‌ఆర్‌ హెడ్‌ అమిత్‌ చక్రవర్తి పెట్టుకున్న పిటిషన్లను ఢిల్లీ హైకోర్టు శుక్రవారం తోసిపుచ్చింది. ఆ రెండు పిటిషన్లలో విచారణకు అర్హమైన అంశాలు లేవనిజస్టిస్‌ తుషార్‌ రావు గేదెల పేర్కొన్నారు. న్యూస్‌క్లిక్‌ ప్రధాన కార్యాలయంపైన, ఆ వెబ్‌ పోర్టల్‌ సిబ్బంది ఇళ్లపైన ఢిల్లీ పోలీసులు ఈ నెల 3న తెల్లవారు జాము నుంచి రోజంతా దాడి చేసి, వ్యవస్థాపక ఎడిటర్‌ ప్రబీర్‌ పుర్కాయస్థను, హెచ్‌ఆర్‌ విభాగం అధిపతి అమిత్‌ చక్రవర్తిని అరెస్టు చేశారు. కోర్టు తీర్పుకు సంబంధించిన పూర్తి వివరాలు అందాల్సి వుంది.

Spread the love