విద్యార్థులు, పాత్రికేయుల వీసా నిబంధనలకు బోస్టన్ కోర్టు బ్రేక్…
విద్యార్థులకు ఊరట
బోస్టన్ : విద్యార్థులు, పాత్రికేయుల వీసాల విషయంలో ట్రంప్ సర్కార్కు బోస్టన్ కోర్టు షాక్ ఇచ్చింది. విదేశీ విద్యార్థులు, ఎక్స్ఛేంజ్ విజిటర్లు, జర్నలిస్టులు అమెరికాలో ఉండే కాలవ్యవధిపై పరిమితి విధించే ప్రతిపాదనను అడ్డుకుంది. ఆ నిబంధన అమల్లోకి రావటానికి ఒకరోజు ముందు ఈ నిర్ణయం వెలువడింది. ఈ కొత్త వీసా నిబంధనలకు సంబంధించి హోమ్ల్యాండ్ సెక్యూరిటీ విభాగం చెప్పిన కారణాలు సమర్థనీయంగా లేవని బోస్టన్ జిల్లా కోర్టు అభిప్రాయపడింది. 50 ఏండ్లకు పైగా అమలులో ఉన్న విధానాన్ని ఒక్కసారిగా మార్చడం సరైన నిర్ణయం కాదని స్పష్టం చేసింది. ఈ నిబంధన అమలైతే విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలు తగ్గి అమెరికా ఉన్నత విద్యారంగంతోపాటు ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుందని కోర్టు హెచ్చరించింది. అమెరికాలో చదువుకోవటానికి వెళ్లే విద్యార్థులకు నాలుగేళ్ల కాలపరిమితి నిబంధన విధిస్తూ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ విభాగం జులైలో ప్రకటన చేసింది. జే1 వీసాలపై వచ్చే ఎక్స్ఛేంజ్ విజిటర్లు, ఐ-వీసాలపై వచ్చే మీడియా ప్రతినిధులకు కాలపరిమితిని విధించేలా ప్రతిపాదనలను రూపొందించింది. ఎఫ్1 వీసాలపై వచ్చిన విద్యార్థులు కోర్సు పూర్తయ్యేవరకూ డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్’ కింద యూఎస్లో ఉంటున్నారు. ఆ నిబంధనను ఎత్తివేయాలని ట్రంప్ సర్కార్ భావించింది.



