Friday, May 29, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంక్వార్టర్స్‌లో 
సింధు, లక్ష్యసేన్‌

క్వార్టర్స్‌లో 
సింధు, లక్ష్యసేన్‌

- Advertisement -

సింగపూర్‌ : భారత అగ్రశ్రేణి షట్లర్లు సింగపూర్‌ ఓపెన్‌లో క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకున్నారు. మహిళల సింగిల్స్‌లో పి.వి సింధు, పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్‌, పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌, చిరాగ్‌ శెట్టి జోడీ సహా మిక్స్‌డ్‌ డబుల్స్‌లో ధ్రువ్‌ కపిల, తనీశ క్రాస్టో జంట సింగపూర్‌ ఓపెన్‌ సూపర్‌ 750 టోర్నమెంట్‌లో ముందంజ వేశారు. మహిళల సింగిల్స్‌లో స్టార్‌ షట్లర్‌, రెండు సార్లు ఒలింపిక్‌ పతక విజేత పి.వి సింధు జపాన్‌ షట్లర్‌ రికో గంజీపై వరుస గేముల్లో గెలుపొందింది. 37 నిమిషాల్లోనే ముగిసిన ప్రీ క్వార్టర్‌ఫైనల్లో సింధు 21-9, 21-12తో ఏకపక్ష విజయం సాధించింది. ఏ గేమ్‌లోనూ జపాన్‌ అమ్మాయి నుంచి ప్రతిఘటన ఎదురుకాలేదు. చెమట పట్టకుండా పాయింట్లు సాధించిన సింధు క్వార్టర్‌ఫైనల్లోకి దూసుకెళ్లింది. పురుషుల డబుల్స్‌ ప్రీ క్వార్టర్‌ఫైనల్లో నాల్గో సీడ్‌ సాత్విక్‌సాయిరాజ్‌ రాంకిరెడ్డి, చిరాగ్‌ శెట్టి జోడీ మూడు గేమ్‌ల థ్రిల్లర్‌లో చైనీస్‌ తైపీ షట్లర్లపై పైచేయి సాధించారు. గంటకు పైగా సాగిన మ్యాచ్‌లో 21-15, 11-21, 21-18తో సాత్విక్‌, చిరాగ్‌లు అదరగొట్టారు. తొలి గేమ్‌ను సాత్విక్‌, చిరాగ్‌లు అలవోకగా నెగ్గగా.. రెండో గేమ్‌లో చైనీస్‌ తైపీ జోడీ జోరందుకుంది. నిర్ణయాత్మక మూడో గేమ్‌ హోరాహోరీగా సాగింది. 7-3తో ఆరంభంలో సాత్విక్‌, చిరాగ్‌ ముందంజ వేసినా.. విరామ సమయానికి 10-11తో వెనుకంజలో నిలిచారు. ద్వితీయార్థంలో ప్రతి పాయింట్‌కు ఆధిక్యం చేతులు మారింది. 17-17తర్వాత వరుసగా పాయింట్లు ఖాతాలో వేసుకున్న వరల్డ్‌ నం.4 భారత జోడీ.. 21-18తో స్పష్టమైన తేడాతో మూడో గేమ్‌ను, క్వార్టర్‌ఫైనల్‌ బెర్త్‌ను దక్కించుకుంది.

పురుషుల సింగిల్స్‌లో స్టార్‌ షట్లర్‌ లక్ష్యసేన్‌ క్వార్టర్స్‌కు చేరుకున్నాడు. రెండో సీడ్‌, థాయ్‌లాండ్‌ ఆటగాడు కునాల్‌విట్‌ తొలి గేమ్‌లో లక్ష్యసేన్‌ 2-0తో ముందంజలో నిలిచిన సమయంలో మ్యాచ్‌ నుంచి తప్పుకున్నాడు. ప్రత్యర్థి వాకోవర్‌తో లక్ష్యసేన్‌ క్వార్టర్స్‌ బెర్త్‌ ఖాయం చేసుకున్నాడు. తొలి రౌండ్లో వరల్డ్‌ నం.5 జొనాథన్‌ క్రిస్టీపై విజయంతో సంచలనం రేపిన సీనియర్‌ షట్లర్‌ హెచ్‌.ఎస్‌ ప్రణయ్‌ ప్రీ క్వార్టర్స్‌లో నిరాశపరిచాడు. సింగపూర్‌ షట్లర్‌ చేతిలో మూడు గేముల మ్యాచ్‌లో ఓటమి చెందాడు. 18-21, 21-16, 15-21తో 61 నిమిషాల పాటు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో ప్రణయ్‌ పోరాడి ఓడాడు. మిక్స్‌డ్‌ డబుల్స్‌ ప్రీ క్వార్టర్‌ఫైనల్లో ధ్రువ్‌ కపిల, తనీశ క్రాస్టో జంట ముందంజ వేసింది. 8-21తో తొలి గేమ్‌లో జపాన్‌ జోడీ ముందు తలొగ్గిన కపిల, తనీశ తర్వాత వరుస గేముల్లో అదరగొట్టారు. 21-17, 21-16తో దూకుడుగా ఆడారు. 58 నిమిషాల ప్రీ క్వార్టర్స్‌లో జపాన్‌ షట్లర్లను ఓడించి క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకున్నారు. మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ఫైనల్లో టాప్‌ సీడ్‌, చైనీస్‌ తైపీ షట్లర్‌ అంగ్‌ సె యంగ్‌తో పి.వి సింధు తలపడనుండగా.. మెన్స్‌ సింగిల్స్‌ క్వార్టర్‌ఫైనల్లో జపాన్‌ షట్లర్‌ కొకితో లక్ష్యసేన్‌ ఢీకొట్టనున్నాడు. పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌, చిరాగ్‌లు నేడు కఠిన సవాల్‌ ఎదుర్కొనున్నారు. ఈ ఏడాది ఆల్ ఇంగ్లాండ్‌ చాంపియన్‌షిప్‌ ఫైనల్లో సాత్విక్‌, చిరాగ్‌ను ఓడించిన మలేషియా షట్లర్లు నేడు క్వార్టర్స్‌లో మరోసారి సవాల్‌ విసరనున్నారు. ధ్రవ్‌ కపిల్‌, తనీశ కాస్ట్రోలు సైతం నాల్గో సీడ్‌ మలేసియా జోడీతో నేడు తాడోపేడో తేల్చుకోనుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -