గంగా నదిలో బోటు మునక.. ఆరుగురు గల్లంతు

నవతెలంగాణ-హైదరాబాద్ : బీహార్ రాజధాని పాట్నాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. 17 మంది భక్తులతో వెళుతున్న పడవ గంగానదిలో మునిగిపోయింది. దీంతో 11 మంది ఈదుతూ ఒడ్డుకు చేరుకోగా.. ఆరుగురు నదిలో గల్లంతయ్యారని అధికారులు చెప్పారు. ఆదివారం ఉదయం జరిగిందీ దారుణం. పాట్నాకు సమీపంలోని బాఢ్ గ్రామం గంగానది ఒడ్డున ఉంది. గంగా దసరా పండుగ సందర్భంగా ఆదివారం పెద్ద సంఖ్యలో నదీ తీరానికి వచ్చారు. నదీ స్నానం చేసి అవతలి ఒడ్డుకు వెళ్లేందుకు పడవ ఎక్కారు. నది మధ్యలోకి వెళ్లిన తర్వాత పడవ మునిగిపోయింది. దీంతో భక్తులంతా నీళ్లలో పడగా.. పదకొండు మంది ఈదుతూ ఒడ్డుకు చేరుకున్నారు. మిగతా వారు నీళ్లలో మునిగిపోయారని అధికారులు చెప్పారు. ప్రమాద సమయంలో పడవలో మొత్తం 17 మంది ఉన్నారని వివరించారు. నదిలో పడవ మునిగిపోయిందనే సమాచారం అందుకున్న వెంటనే ఎస్ డీఆర్ఎఫ్ టీమ్ అక్కడికి చేరుకుంది. నదిలో మునిగిపోయిన ఆరుగురు భక్తుల కోసం గాలింపు చర్యలు చేపట్టింది. కాగా, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. నదిలో మునిగిపోయిన పడవలో దాదాపు 25 మంది వరకు ఎక్కారు. పడవ సామర్థ్యం కన్నా ఎక్కువ మంది ఎక్కడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నామని, ఇప్పటి వరకూ ఎలాంటి ఫలితం కనిపించలేదని అధికారులు చెప్పారు.

Spread the love