రైతుల నుంచి వచ్చే ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలి
ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు : వ్యవసాయ శాఖ సంచాలకులు డాక్టర్ బి.గోపి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఖరీజ్ సీజన్ ఎరువుల సరఫరాపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించామనీ, ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వ్యవసాయ శాఖ సంచాలకులు డాక్టర్ బి.గోపి హెచ్చరించారు. మంగళవారం హైదరాబాద్లోని వ్యవసాయ కమిషనరేట్ లో ఎరువుల డీలర్ల సంఘం ప్రతినిధులు, హోల్సేల్ డీలర్లు, ఎరువుల తయారీ సంస్థల ప్రతినిధులతో ఎరువుల సరఫరా, నిల్వలు, విక్రయాలపై ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా గోపి మాట్లాడుతూ రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్కు అవసరమైన ఎరువులు రైతులకు సకాలంలో అందుబాటులో ఉండేలా అన్ని చర్యలు చేపట్టాలని సూచించారు. జిల్లాల వారీగా ఎరువుల నిల్వలను నిరంతరం పర్యవేక్షిస్తూ కొరత తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఎరువుల విక్రయాల సందర్భంగా పురుగుమందులు, సూక్ష్మపోషకాలు, ఇతర వ్యవసాయ ఉత్పత్తులను బలవంతంగా కొనుగోలు చేయించే లింకింగ్ విధానాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరాదని స్పష్టం చేశారు.
రైతులు కోరిన ఎరువులను మాత్రమే విక్రయించేలా చర్యలు తీసుకోవాలనీ, ఈ విషయంలో ఫిర్యాదులు వచ్చినట్లయితే వెంటనే విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు.
జిల్లా స్థాయిలో తనిఖీలు ముమ్మరం చేసి రైతుల నుంచి వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని సూచించారు. సమావేశంలో సహకార శాఖ ప్రత్యేక సంచాలకులు రాహుల్రాజ్, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు, ఎరువుల తయారీ సంస్థల ప్రతినిధులు, డీలర్ల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఖరీఫ్ ఎరువుల సరఫరాపై ప్రత్యేక దృష్టి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



