నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రావిర్భావ దినోత్సవ వేడుకుల నేపథ్యంలో మంగళవారం హైదరాబాద్లోని సచివాలయంలో పూర్తిస్థాయి రిహార్సల్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సచివాలయ ప్రాంగణంలో నిర్వహించిన పరేడ్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఉన్నతాధికారులు, ఆయా విభాగాల ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎస్ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, జూన్ 2న ఉదయం 10.30 గంటలకు ముఖ్యమంత్రి జెండా ఎగురవేస్తారనీ, ఆయా విభాగాల ఉద్యోగులందరూ విధిగా వేడుకల్లో పాల్గొనాలని ఆదేశించారు. అందరూ కూర్చునేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను కోరారు. సరిపడినంత పోలీస్ భద్రత, సామాన్యులకు ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ నిర్వహణకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
పరేడ్లో పాల్గొన్న వారిలో అడిషనల్ డీజీ స్వాతి లక్రా, ఆర్ అండ్ బీ శ్రీనివాస్ రాజు, సమాచార, పౌర సంబంధాలశాఖ ప్రత్యేక కమిషనర్ అశోక్ రెడ్డి, జలమండలి ఎండీ దానకిషోర్, ప్రోటోకాల్ అడిషనల్ సెక్రెటరీ అర్విందర్ సింగ్, అధికారులు పాల్గొన్నారు.