ధోనీ లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కి దిగడంపై స్పందిచిన స్టీఫెన్ ఫ్లెమింగ్

నవతెలంగాణ – హైదరాబాద్: సీఎస్‌కే మాజీ కెప్టెన్ మ‌హేంద్ర సింగ్‌ ధోనీ చ‌రిష్మా గురించి ఎంత చెప్పినా త‌క్కువే. తన అద్భుత‌మైన ఆట తీరుతో ప్రపంచవ్యాప్తంగా అభిమానుల‌ను సంపాదించుకున్నాడు. ఎంఎస్‌డీ బ్యాటింగ్‌కి దిగుతున్నాడంటే ప్రేక్ష‌కుల అ‌రుపుల‌తో స్టేడియాలు ద‌ద్ద‌రిల్లి పోవాల్సిందే. అయితే, 42 ఏళ్ల ఈ కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో 6 లేదా 7వ స్థానంలో బ్యాటింగ్‌కి దిగుతున్న విష‌యం తెలిసిందే. ఇలా ఇప్ప‌టివ‌ర‌కు లోయ‌ర్ ఆర్డ‌ర్‌లో బ్యాటింగ్‌కి దిగి 5 ఇన్నింగ్స్‌లలో ధోనీ కేవ‌లం 34 బంతుల్లో 255.88 స్ట్రయిక్ రేట్‌తో 87 పరుగులు చేశాడు. అతను ఆడిన అన్ని ఇన్నింగ్స్‌ల్లోనూ నాటౌట్‌గా ఉండ‌డం గ‌మనార్హం. అయితే, ప్ర‌స్తుత సీజ‌న్‌లో బ్యాటింగ్‌లో దుమ్ముదులుపుతున్న ధోనీని ప్రమోట్ చేయాలనే డిమాండ్ రోజురోజుకి పెరిగిపోతోంది. దాంతో ఈ విష‌య‌మై చెన్నై సూప‌ర్ కింగ్స్ ప్రధాన కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ తాజాగా స్పందించాడు. ఎంఎస్‌డీ బ్యాటింగ్ ఆర్డర్ వెనుక ఉన్న అస‌లు కారణాన్ని తెలియ‌జేశాడు. గతేడాది మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్న ధోనీ ఇప్పటికీ 100 శాతం ఫిట్‌గా లేడని అన్నాడు. “గ‌తేడాది ధోనీ మోకాలికి స‌ర్జ‌రీ జ‌రిగింది. దానికి సంబంధించిన నొప్పి నుంచి ఇంకా కోలుకోలేదు. అయితే, త‌న‌ను చూసేందుకు స్టేడియానికి వ‌చ్చే అభిమానుల‌ను నిరాశ‌ప‌ర‌చ‌కూడ‌ద‌నే చివ‌ర్లోనైనా బ్యాటింగ్‌కు వ‌స్తున్నాడు. జట్టులో ధోని ఉండటం చాలా ముఖ్యం. యువకులకు అవకాశం ఇవ్వాల‌ని ధోనీ కోరుకోవ‌డం కూడా అత‌ని లోయర్ ఆర్డర్ బ్యాటింగ్‌కు మరో కారణమం” అంటూ ఫ్లెమింగ్ చెప్పుకొచ్చాడు.

Spread the love