నరమేధం ఆపండి!

Stop the carnage!పాలస్తీనా సాయుధ పోరాట గ్రూప్‌ హమాస్‌, యూదు జాత్య హంకార ఇజ్రాయిల్‌ దళాల మధ్య దాడులు, ప్రతిదాడుల్లో అన్నెంపున్నెం ఎరుగని చిన్నారులతో సహా వందలాది మంది అమాయక పౌరులు చని పోవడం యావత్‌ ప్రపంచాన్ని కలచివేస్తోంది. ‘ఆపరేషన్‌ అల్‌ అక్సా’కు ప్రతిగా ‘ఆపరేషన్‌ స్వోర్డ్స్‌’ పేరుతో ఇజ్రాయిల్‌ చేపట్టిన భీకర వైమానిక దాడుల్లో 91 మంది పిల్లలతో సహా 560 మంది పాలస్తీనీయులు గత నాలుగు రోజుల్లో చనిపోయారు. మరో 2,900 మంది దాకా గాయ పడ్డారు. పాలస్తీనా ప్రతిఘటనా గ్రూపులు చేపట్టిన భారీ ఆపరేషన్‌లో 800మంది దాకా ఇజ్రాయిలీయులు మరణించారని, మరో 2,243 మంది గాయపడ్డారని పాశ్చాత్య మీడియా తెలిపింది. ఇంత భారీ యెత్తున ఘర్షణ లు, హింస చోటు చేసుకోవడం గత ఇరవై ఏండ్లలో ఇదే మొదటిసారి. ఈ భయానక మారణ హోమానికి పూర్తి బాధ్యత ఇజ్రాయిల్‌దే అనడం లో మరో మాటకు తావులేదు. ఇజ్రా యిల్‌ చరిత్రలోనే అత్యంత ఫాసిస్టు తరహా పాలకుడిగా పేరు మోసిన నెతన్యాహు హమాస్‌ భారీ ఆపరేషన్‌ను సాకుగా తీసుకుని పాలస్తీనీయులపై పెద్దయెత్తున వైమానిక దాడులు కొససాగించడంతోబాటు గాజా ను పూర్తిగా దిగ్బంధించే చర్యలకు పాల్పడుతున్నాడు. పాలస్తీనా ప్రజలకు నీరు, ఆహారం, కరెంటు, ఇంధన సరఫరాలను అందకుండా చేస్తున్నాడు.
75 ఏండ్లుగా పాలస్తీనీయుల భూభాగాలను ఆక్రమిం చుకుని, పాలస్తీనీయులను తమ సొంతగడ్డపై శరణా ర్థులుగా మార్చిన ఇజ్రాయిల్‌ అకృత్యాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. అమెరికా అండ చూసుకునే అది మోర విడుచుకుని ఇంతగా బరి తెగిస్తున్నది. ఇజ్రాయిల్‌ మిలిటరీ బడ్జెట్‌కు అమెరికా ప్రతి యేటా భారీగా సాయం అందిస్తున్నది. ఈ ఒక్క ఏడాదే 27,443 కోట్ల రూపాయల నిధులు సమకూర్చింది. గాజాపై దండెత్తుతున్న ఇజ్రాయిల్‌కు మద్దతుగా బైడెన్‌ ప్రభుత్వం తన భారీ యుద్ధ విమాన నౌకలను, క్షిపణులను మధ్యదరా సముద్ర తీరంవైపు పంపుతున్నది. ఇజ్రాయిల్‌పై హమాస్‌ జరుపుతున్న దాడిని ఖండించాలని ప్రపంచ దేశాలపై ఒత్తిడి తెస్తున్నది. భారత్‌లో మోడీ ప్రభుత్వం ఇప్పటికే ఆ ఒత్తిడికి తలొగ్గింది. మితవాదం, జాత్యహంకారం వంటి విషయాల్లో నెతన్యాహుకు మోడీ ఏమాత్రం తీసిపోరనడానికి గత తొమ్మిదేండ్లలో దేశంలో చోటు చేసుకున్న ఘటనలే నిదర్శనం.
అసలు ఇజ్రాయిల్‌ పుట్టుకే విచిత్రం. 1947 నవంబర్‌ 29న ఐక్యరాజ్య సమితి జనరల్‌ అసెంబ్లీ పాలస్తీనా భూభాగాన్ని మూడు భాగాలుగా విభజించాలని ప్రతిపాదించింది. దీనికి 33 దేశాలు మద్దతు పలకగా, స్వతంత్ర భారతదేశం సహా 13 దేశాలు అభ్యంతరం తెలిపాయి. చైనా సహా 10 దేశాలు గైర్హాజరయ్యాయి. 1948లో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఆమోదం లేకుండానే బ్రిటన్‌ అండతో ఇజ్రాయిల్‌ ఏకపక్షంగా దేశాన్ని ప్రకటించుకుంది. ‘ఇంగ్లాండ్‌ ఆంగ్లేయులకు, ఫ్రాన్స్‌ ఫ్రెంచ్‌లకు చెందినట్లే పాలస్తీనా అరబ్బులకు చెంది నది’ అని మహాత్మాగాంధీ ‘హరిజన్‌’ వారపత్రికలో 1931లోనే రాశారు. చమురు వనరులకు కొదవలేని పశ్చిమాసియాలో వనరులను కొల్లగొట్టుకుపోయేందుకు సామ్రాజ్య వాద దేశాలు పన్నిన కుటిల పన్నాగంలో భాగంగానే ఇజ్రాయిల్‌ ఆవిర్భావం జరి గింది. తూర్పు జెరూసలెం రాజధానిగా స్వతంత్ర పాలస్తీనా ఏర్పాటుకు ఐక్య రాజ్యసమితి చేసిన తీర్మానాలు, రూపొందించిన ప్రణాళికలు ఇంతవరకు వాస్తవరూపం దాల్చలేదు. ఐరాస ఆధీనంలో ఉండాలని నిర్ణయించిన జెరూసలెంను మూడేండ్లలోనే ఇజ్రాయిల్‌ ఆక్రమించుకుంది. 1993 నాటి ఓస్లో ఒప్పందాలు పాలస్తీనా రాజ్యం ఏర్పడుతుందనే భావన కలిగించినా, ఆచరణ అందుకు భిన్నంగా సాగింది. ఇజ్రాయిల్‌ సెక్యులర్‌ శక్తులను నాశనం చేసి, పాలస్తీనా భూభాగాలను ఆక్రమించుకుంటూ వెళ్లింది. నాటి పాలస్తీనా భూభాగంలో 13 శాతం మాత్రమే నేడు పాలస్తీనా నియంత్రణ లో ఉంది. ఇప్పుడు గాజాపై నెతన్యాహు దండెత్తి ఆ భూభాగాన్ని కూడా కబళించాలని చూస్తున్నాడు. పశ్చిమాసియాపై తన ఆధిపత్యాన్ని కొనసా గించేందుకు ఇజ్రాయిల్‌ కేంద్రంగా అమెరికా తన రాజకీయ భౌగోళిక వ్యూహాన్ని దూకుడుగా అమలుచేస్తున్నది.
అమెరికా అండతోనే పాలస్తీనాకు చెందిన వెస్ట్‌బ్యాంకు, తూర్పు జెరూసలెంలలో పాలస్తీనీయులను గెంటివేసి 63 లక్షలకు పైగా ఇజ్రాయిలీ సెటిలర్లు అక్రమంగా నివాసాలు ఏర్పాటు చేసు కోవడం, ఈ సెటిలర్ల గ్యాంగ్‌లు, ఇజ్రాయిల్‌ ఆర్మీ కలసి హువారా ప్రాంతంలో పాలస్తీనీయుల ఇండ్లను, కార్లకు తగులబెట్టడం వంటి దుశ్చర్యలకు పాల్పడ్డారు. వీటన్నిటి పర్యవసానమే హమాస్‌ గత శనివారం జరిపిన ఆపరేషన్‌. ఇజ్రాయిల్‌ను సమర్థించేవారు దీనికి ఏం సమాధానం చెప్తారు? గాజా ప్రజలపై వార్‌ డిక్లేర్‌ చేసిన నెత న్యాహు ప్రభుత్వం తెల్ల భాస్వరాన్ని ఆయుధంగా ఉపయోగిం చడం అత్యంత హేయమైన చర్య. ఇటువంటి పదార్థాలను యుద్ధంలో ఉపయోగించకుండా అంతర్జాతీయు చట్టం నిషేధం విధించింది. ఇటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో పౌరుల మరణాలను అరికట్టాల్సిన బాధ్యత అంతర్జాతీయ సమాజంపై ఉంది. దీనికి ఒకే ఒక పరిష్కారం పాలస్తీనీయుల న్యాయ సమ్మతమైన డిమాండ్లను అంగీకరించడం. అదే సమయంలో అమాయక పౌరులకు హాని కలిగించే చర్యలను ముక్తకంఠంతో ఖండించడం. భద్రత ఇజ్రాయి లీలకు మాత్రమే కాదు, పాలస్తీనీయులకు కూడా ఉండాలి. మానవ హక్కులు, పూర్తి స్థాయి పౌరసత్వం, తమ స్వస్థలాలకు తిరిగి వచ్చే పాలస్తీనీయుల హక్కును అమలు చేసేందుకు ఐరాస కృషి చేయాలి. శాంతిని, ప్రజాస్వామ్యాన్ని కోరుకునే వారంతా పాలస్తీనాకు సంఘీభావంగా నిలవాలి.

Spread the love