నేడు కేజ్రీవాల్‌కు బెయిల్‌పై సుప్రీం ఆదేశాలు

నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ బెయిల్‌ పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వనుంది. అయితే మద్యం కుంభకోణంకు సంబంధించి.. మనీ ల్యాండరింగ్‌ కేసులో అరెస్టైన ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్‌ను ఈడీ వ్యతిరేకించింది. ఆయన ఎన్నికల ప్రచారం చేసే హక్కు.. ప్రాథమికమైనది కాదని స్పష్టం చేసింది. అలాగే రాజ్యాంగం కల్పించిన హక్కు కాదు.. న్యాయపరమైన హక్కు కూడా కాదని ఈడీ పేర్కొంది. గురువారం సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ను ఈడీ దాఖలు చేసింది. ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి ఏ రాజకీయ నాయకుడికి మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసిన దాఖలాలైతే లేవని తన అఫిడవిట్‌లో పేర్కొంది. అదీకాక ఆయన ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థి కూడా కాదని వివరించింది. గతంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సమన్లు తప్పించుకొనేందుకు అరవింద్‌ కేజ్రీవాల్‌… ఈ తరహా పద్ధతిని అనుసరించారని తన అఫిడవిట్‌లో ఈడీ గుర్తు చేసింది. ఎన్నికల ప్రచారం కోసం జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్న ఏ రాజకీయ నాయకుడు మధ్యంతర బెయిల్‌ ఇచ్చిన ఘటనలైతే లేవని తెలిపింది. గత మూడేండ్లలో చాలా ఎన్నికలు జరిగాయని.. అయితే అరెస్ట్‌ అయిన ఏ రాజకీయ నాయకుడికి మధ్యంతర బెయిల్‌ ఇవ్వలేదని అఫిడవిట్‌లో సోదాహరణగా వివరించింది. ఓ వేళ ఎన్నికల ప్రచారం కోసం కేజ్రీవాల్‌కు ప్రత్యేక రాయితీతో మధ్యంతర బెయిల్‌ మంజూరు చేస్తే.. అది చట్టం పరిధి దాటినట్లు అవుతుందంది. అనైతిక రాజకీయ నాయకులు ఎన్నికల ముసుగులో దర్యాప్తు నుంచి తప్పించుకొనేందుకు మధ్యంతర బెయిల్‌ పేరిట ప్రయత్నిస్తారని తన అఫిడవిట్‌లో ఈడీ ఆరోపించింది. ఓ వేళ జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్న వ్యక్తులు ఎన్నికల బరిలో నిలిచినా.. వారికి మధ్యంతర బెయిల్‌ ఇవ్వలేదని ఈడీ తన అఫిడవిట్‌లో గుర్తు చేసింది. సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తనకు బెయిల్‌ మంజూరు చేయాలని సుప్రీం కోర్టులో ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ క్రమంలో ఈడీ, కేజ్రీవాల్‌ తరఫు న్యాయవాదుల వాదనలను జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా నేతత్వంలోని ధర్మాసనం విని.. తీర్పును శుక్రవారానికి రిజర్వ్‌ చేసింది. ఆ క్రమంలో అరవింద్‌ కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్‌ ఇవ్వొద్దంటూ.. సుప్రీంకోర్టులో ఈడీ అఫిడవిట్‌ దాఖలు చేసింది. ఓ వేళ.. అరవింద్‌ కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేస్తే.. అధికారిక విధుల్లో పాల్గొనడం కానీ.. ఫైళ్లపై సంతకాలు కానీ చేయకూడదంటూ సుప్రీంకోర్టు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

Spread the love