నవతెలంగాణ న్యూఢిల్లీ: భద్రతా వైఫల్యం (Security Breach) ఘటన పార్లమెంట్ (Parliament) ఉభయ సభలను కుదిపేస్తుంది. డిసెంబరు 13 నాటి ఈ భద్రతా వైఫల్యం (Security Breach)పై హోం మంత్రి ప్రకటన చేయాలంటూ విపక్షాలు పట్టుబడుతున్నాయి. దీంతో గత గురువారం మొదలైన ప్రతిపక్ష సభ్యుల సస్పెన్షన్ల పర్వం మంగళవారం కూడా కొనసాగుతోంది. తాజాగా మరో 49 మంది విపక్ష ఎంపీలపై స్పీకర్ వేటు వేశారు. ఈ సమావేశాల మొత్తానికి వారిని సస్పెండ్ చేస్తున్నట్టు తెలిపారు. ఎంపీలు సుప్రియా సూలే, ఫరూక్ అబ్దుల్లా, శశి థరూర్, కార్తి చిదంబరం, డింపుల్ యాదవ్, మనీశ్ తివారీ తదితరులు సస్పెన్షన్కు గురైన వారిలో ఉన్నారు.
కాగా.. లోక్సభలో ఇప్పటికే గతవారం 13 మందిని, సోమవారం మరో 33 మందిని సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. తాజా సంఖ్యతో కలిపి ఇప్పటి వరకు లోక్సభలో 95 మందిపై వేటు పడినట్లైంది. మరోవైపు రాజ్యసభలో ఇప్పటి వరకు 46 మందిని సస్పెండ్ చేశారు. దీంతో ఈ శీతాకాల సమావేశాల్లో ఇప్పటి వరకు మొత్తం 141 మంది విపక్ష ఎంపీలను ఈ ప్రభుత్వం సస్పెండ్ చేసింది.