నవతెలంగాణ-హైదరాబాద్ : లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్లో టీచర్లను ఎన్నికల విధుల్లోకి తీసుకోవాలని నిర్ణయించింది. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) ఆదేశాలతో టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది వివరాలను డీఈవోలు సేకరిస్తున్నారు. ఎన్నికల విధులకు సచివాలయ సిబ్బంది సరిపోరని బుధవారం విజయవాడలో నిర్వహించిన సీఈసీ భేటీలో ప్రస్తావనకు వచ్చింది. దీంతో ఉపాధ్యాయులనూ ఎన్నికల విధుల్లోకి తీసుకోవాలని సీఈసీ సూచించారు. శుక్రవారం ఉదయం 11 గంటల్లోగా టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ వివరాలు ఇవ్వాలని డీఈవోలను ఆదేశించారు. ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లుగా వారిని నియమించనున్నారు.
ఉపాధ్యాయులను ఎన్నికల విధుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం తప్పించింది. వారిలో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని గ్రహించిన ప్రభుత్వం వచ్చే ఎన్నికల్లో ఎన్నికల విధులకు దూరంగా ఉంచేందుకు ఏపీ ఉచిత, నిర్బంధ విద్య (విద్యా హక్కు చట్టం) నియమాలు-2010కి సవరణ చేసింది. వారికి బోధనేతర పనులను అప్పగించవద్దని, విద్యకు సంబంధించిన కార్యకలాపాలకే పరిమితం చేయాలని పేర్కొంది. కేంద్రం తీసుకొచ్చిన విద్యా హక్కు చట్టం-2009లోని సెక్షన్ 27 ప్రకారం జనాభా గణన, విపత్తు సహాయ విధులు, స్థానిక సంస్థలు, రాష్ట్ర శాసనసభలు, పార్లమెంటు ఎన్నికలకు సంబంధించిన విధులు మినహా విద్యేతర పనులకు వారిని వినియోగించకూడదు. అయితే సెక్షన్-27లోని నిబంధనలకు అనుగుణంగా బోధనేతర పనులు అప్పగించకూడదనే అంశాన్ని బలోపేతం చేసేందుకు సవరణలు తీసుకొచ్చినట్టు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. టీచర్లను ఎన్నికల విధులకు దూరంగా పెట్టి.. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందిని వినియోగించేందుకు ఈ సవరణ తీసుకొచ్చారనే విమర్శలు వెల్లువెత్తాయి.