– సీఎంకు మాజీ మంత్రి హరీశ్రావు లేఖ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం టెట్ ఫీజులను భారీగా పెంచటంతో పాటు.. ఎస్సీ, ఎస్టీ, వికలాంగ విద్యార్థులకు ఇచ్చే రాయితీని విస్మరించటం విద్యార్థులు, నిరుద్యోగును మోసం చేయటమేనని తెలియజేస్తూ మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి హరీశ్రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం సీఎం రేవంత్రెడ్డికి ఆయన లేఖ రాశారు. అనేక కష్టాలకు ఓర్చి ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులు, నిరుద్యోగుల నుంచి అధిక ఫీజులు వసూలు చేయడం బాధాకరమని తెలిపారు. దీన్ని మేం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో టెట్ ఒక పేపర్ రాసినా, రెండు పేపర్లు రాసినా రూ.400 మాత్రమే ఫీజు తీసుకోగా, ఈ ఏడాది ఒక పేపర్కు రూ.వెయ్యి, రెండు పేపర్లకు రూ.రెండువేలు ఫీజుగా వసూలు చేస్తున్నారని తెలిపారు. ఈ ఫీజులు సీబీఎస్ఈ నిర్వహించే సీటెట్తో పోల్చితే డబుల్గా ఉన్నాయని పేర్కొన్నారు. రిజర్వుడ్ విద్యార్థులకు ఫీజు రాయితీ కల్పించకుండా జనరల్ క్యాటగిరీ విద్యార్థులతో సమానంగా ఒకే తరహా ఫీజులను అమలు చేయటం రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధమని తెలిపారు. జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న సీటెట్లో ఎస్సీ, ఎస్టీలకు సీబీఎస్ ఈ ఫీజు రాయితీని అమలు చేస్తున్నదని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఎప్సెట్, ఐసెట్ వంటి ప్రవేశ పరీక్షల్లోనూ ఫీజుల రాయితీని అమలు చేస్తున్నా రని పేర్కొన్నారు. కానీ టెట్లో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం రాయితీ ఇవ్వటం లేదని తెలిపారు. టెట్ ఫీజుల పెంపు, రిజర్వుడ్ విద్యార్థులకు ఫీజు రాయితీ కల్పించక పోవడాన్ని నిరసిస్తూ బీఈడీ, డీఎడ్ అభ్యర్థులు రాష్ట్రవ్యాప్తంగా పోరాడుతున్నారని గుర్తు చేశారు. అయినా ప్రభుత్వం నుండి కనీస స్పందన లేదని పేర్కొన్నారు. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం, సోకాల్డ్ ప్రజా పాలన అని ప్రశ్నించారు. నిరుద్యోగుల నుంచి రూపాయి ఫీజు తీసుకోకుండా దరఖాస్తులు స్వీకరిస్తామని మ్యానిఫెస్టోలో చెప్పిన కాంగ్రెస్, ఇప్పుడు ఫీజుల పేరుతో నిరుద్యోగుల నడ్డీ విరుస్తోందని విమర్శించారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే విద్యార్థులు, నిరుద్యోగుల తరుపున పోరాటం తప్పదని హెచ్చరించారు.