– అమలు కాని రాజ్యాంగ పీఠికలోని అంశాలు : రాజకీయ విశ్లేషకులు పరకాల ప్రభాకర్
నవతెలంగాణ-మిర్యాలగూడ
రాజ్యాంగ పీఠికలో ఉన్న అంశాలు ఏ ఒక్కటి కూడా ప్రస్తుతం అమలు కావడం లేదని.. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ రక్షణ కోసం ప్రజలు గొంతెత్తి నినదించాల్సిన అవసరం ఉందని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పరకాల ప్రభాకర్ అన్నారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని ఐఎంఏ హాల్ రామచంద్రగూడలో జనవిజ్ఞాన వేదిక నాయకులు డా.మువ్వా రామారావు అధ్యక్షతన’పదేండ్ల కేంద్ర పాలనలో ప్రజాజీవితం.. దేశ భవిష్యత్’ అనే అంశంపై టీపీజే ఏసీ, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో గురువారం సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా పరకాల ప్రభాకర్ మాట్లాడుతూ.. రాజ్యాంగ మౌలికసూత్రాలకు లోబడి పరిపాలించాల్సిన పాలకులు.. వాటిని విస్మరిస్తున్న విషయాన్ని ప్రజలు గమనించా లని కోరారు. డాక్టర్ మువ్వా రామారావు మాట్లాడుతూ.. దేశానికి రాజ్యాంగమే ఐకాన్ అని, ప్రతి ఒక్కరూ రాజ్యాంగ సూత్రాలకు కట్టుబడి ఉండాలని అన్నారు. మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి, టీపీజాక్ నాయకులు రవీందర్ మాట్లాడుతూ.. దేశంలో పేదరికం, నిరుద్యోగ నిర్మూలన, ఆదాయ సమానతలకు చర్యలు తీసుకోవాల్సిన పాలకులు అసమానతలు పెంచే కార్యక్రమాలు చేయడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకులు డాక్టర్ రాజు, బీసం రామయ్య, వేనేపల్లి పాండు రంగారావు, జ్వాల వెంకటేశ్వర్లు, సీపీఐ(ఎం) నాయకులు డబ్బికార్ మల్లేశ్, రావినాయక్, జనవిజ్ఞాన వేదిక నాయకులు కొండల్రెడ్డి, సుదర్శన్, మౌసమ్ హుస్సేన్, బ్రహ్మానందరెడ్డి పాల్గొన్నారు.