ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరవాలి: హరీశ్‌రావు

నవతెలంగాణ – హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నీటి మూటలను తలపిస్తున్నాయని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావు అన్నారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే హామీలు అమలు చేస్తామని బాండ్ పేపర్ల మీద రాసిచ్చిన కాంగ్రెస్ పార్టీ, 191 రోజులు గడిచినా ఆచరణలో మాత్రం విఫలమైందని విమర్శించారు.  పక్క రాష్ట్రం ఏపీలో అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి అన్ని రకాల పింఛన్లు పెంచితే, ఒడిశా ముఖ్యమంత్రి వరి కనీస మద్దతు ధర క్వింటల్‌కు రూ. 3100 చేస్తూ నిర్ణయం తీసుకున్నారని హరీశ్‌రావు తెలిపారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరవాలని హితవుపలికారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లుగా వృద్ధులు, వితంతువుల పింఛన్లు రూ.4 వేలు, దివ్యాంగులకు 6 వేలు పెంచుతూ తక్షణమే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 10 శాతం మాత్రమే పండించే సన్న వడ్లకు రూ. 500 బోనస్ ఇస్తామని చేతులు దులుపుకున్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలో చెప్పినట్లుగా అన్ని రకాల వడ్లకు బోనస్ ఇస్తామని ప్రకటించాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన ఆరు గ్యారెంటీలు, 13 హామీలను అమలు చేయాలన్నారు.

Spread the love