అకస్మాత్తుగా పార్టీ నిర్మాణం, కమిటీలపై దృష్టి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
టీఆర్ఎస్ అధినేత్రి, తన కూతురు కల్వకుంట్ల కవిత ప్రభావం.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై పడిందా? అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. 2023 అసెంబ్లీ ఎన్నికల నుంచి మొన్నటి మున్సిపల్ ఎన్నికల దాకా పలు ఎలక్షన్లలో పార్టీ ఓడిపోయినా బయటకు రాని కేసీఆర్.. ఇప్పుడు అకస్మాత్తుగా ఎర్రవెల్లి ఫామ్హౌస్ నుంచి తెలంగాణ భవన్కు రావటమే ఇందుకు కారణం. శాసనసభ ఎన్నికల ఫలితాల తర్వాత అటు లీడర్లకు, ఇటు క్యాడర్కు దూరంగా ఉంటూ వస్తున్న గులాబీ బాస్, తన అనుయాయులు తప్ప, ఇతరులెవ్వరికీ అపాయింట్మెంట్ ఇవ్వని కేటీఆర్.. ఇప్పుడు కవిత దెబ్బకు అనివార్యంగా తమ సహజ శైలికి భిన్నంగా వ్యవహరించాల్సిన పరిస్థితి నెలకొన్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అన్ని ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవటంతో నిరాశలో కూరుకుపోయిన కారు పార్టీ శ్రేణులు ఇప్పుడు కవిత ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ వైపు చూస్తున్నాయనే సంకేతాలు బలంగా వినబడుతున్నాయి. దీంతో దిద్దుబాటు చర్యల కోసం స్వయంగా కేసీఆరే రంగంలో దిగారని సమాచారం. క్యాడర్లో జోష్ నింపి, తద్వారా పార్టీకి మళ్లీ జవసత్వాలు తీసుకురావాలని ఆయన కేటీఆర్ను ఆదేశించారు. వాస్తవానికి కార్యకర్తల శిక్షణకు సంబంధించి 2018 నుంచి ఇదిగో.. అదిగో.. అంటూ బీఆర్ఎస్ కాలయాపన చేసింది. హైదరాబాద్లోని తెలంగాణ భవన్తోపాటు జిల్లాల్లోనూ శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తామని కేసీఆర్ రెండోసారి (2018) అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రకటించారు. కొద్ది రోజులకే తొలుత జిల్లా ఆఫీసులను నిర్మిద్దాం, ఆ తర్వాత ట్రైనింగ్ క్లాసులు పెడదామంటూ దాటవేశారు. ఆ తర్వాత కూడా అనేక సందర్భాల్లో శిక్షణా కార్యక్రమాల గురించి ప్రకటించారు. కానీ అవేవీ జరగలేదు. ఇప్పుడు కేసీఆర్ మరోసారి వాటి గురించి ప్రస్తావించినప్పటికీ… గత అనుభవాల రీత్యా జరగుతాయా? లేదా? అన్నది ప్రశ్నార్థకంగా మారిందని గులాబీ శ్రేణులు పేర్కొంటున్నాయి. కానీ కవిత మాత్రం రాజకీయ పార్టీ ఏర్పాటుకు ముందు నుంచే జాగృతి కార్యకర్తలకు రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహించటం గమనార్హం.
కవిత ఎఫెక్ట్..కేసీఆర్ బయటకు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



