ఇద్దరు ఖైదీల జీవిత ప్రయాణం

మోహన్‌ భగత్‌, సుప్రిత సత్యనారాయణ్‌, భూషణ్‌ కళ్యాణ్‌, రవీంద్ర విజరు కీలక పాత్రల్లో నటించిన సినిమా ‘ఆరంభం’. ఈ సినిమాను ఏవీటీ ఎంటర్‌ టైన్‌ మెంట్‌ బ్యానర్‌ పై అభిషేక్‌ వీటీ నిర్మించారు. అజరు నాగ్‌ వి దర్శకత్వం వహించారు. ఎమోషనల్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఈనెల 10న గ్రాండ్‌ థియేట్రికల్‌ రిలీజ్‌కు రాబోతోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర ట్రైలర్‌ విడుదల కార్యక్రమాన్ని ప్రసాద్‌ ల్యాబ్స్‌లో నిర్వహించారు. నిర్మాత అభిషేక్‌ వీటీ మాట్లాడుతూ, ‘ఈ సినిమా ట్రైలర్‌లో చెప్పినట్లు మనం చేసే ప్రయాణంలో మనతో ఉండే తోడు ఎవరేది చాలా ముఖ్యం. అలా నాకు ఈ సినిమా ప్రొడ్యూస్‌ చేసే ప్రయాణంలో టీమ్‌ మెంబర్స్‌ అంతా తోడుగా దొరికారు. సినిమా మీకు తప్పకుండా నచ్చుతుంది. ఈ సినిమా మేకింగ్‌ టైమ్‌లో ఇది పక్కా కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ లేని సినిమా అని తెలుసు. కానీ కథ విన్నప్పుడు చాలా ఇంప్రెస్‌ అయ్యాను. మంచి కంటెంట్‌ ఉన్న సినిమాలకు ఆదరణ దక్కుతున్న రోజులు ఇవి. అలా ఈ సినిమా కూడా సక్సెస్‌ అవుతుందని నమ్ముతున్నాం’ అని అన్నారు. ‘కన్నడ నవల ఆధారంగా ఈ మూవీకి స్క్రిప్ట్‌ చేశాను. ఈ సినిమా కథను లైన్‌గా చెప్పాలంటే ఇద్దరు ఖైదీలు జైలు నుంచి తప్పించుకుంటారు. వారి కేసు ఇన్వెస్టిగేషన్‌ కోసం ఇద్దరు డిటెక్ట్టీవ్‌లు రంగంలోకి దిగుతారు. వారికి ఒక డైరీ దొరుకుతుంది. ఖైదీల గురించి ఆ డైరీలో ఏముంది. వాళ్లు దొరికారా లేదా అనేది ఆసక్తికరం’ అని దర్శకుడు అజరు నాగ్‌ తెలిపారు.

Spread the love