పదివేల కోట్ల రుణం కోసం ప్రపంచ బ్యాంకు వద్దకు
రాయబారం కోసం కన్సల్టెన్సీ నియామకం
రుణం పొందితే సంస్కరణలు అమలు చేయాల్సిందే
ప్రజలపై నేరుగా భారాలు పడే అవకాశం
గుడిగ రఘు
మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సి పాల్టీల్లో అద్దాల్లాంటి రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రయినేజీలు, పరిశుభ్రత, పచ్చదనం, ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్యం అందించటమే తమ లక్ష్యమని చెబు తున్న ప్రభుత్వం… అందుకోసం భారీగా అప్పులు తెచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. కొత్త ప్రాజెక్టులు రావాలంటే, అందుకోసం భారీగా వ్యయం చేయాల్సి ఉంటుందనీ, అందుకే రుణాల కోసం వేట ప్రారంభించామని అధికారులు చెబుతు న్నారు. అందులో భాగంగానే మూసీ పునరుద్ధరణ కోసం ప్రభుత్వం రూ. వేల కోట్ల అప్పులు చేయనుంది. కాగా సర్కారు ఇప్పటికే అప్పుల ఊబిలో కూరుకు పోతుంటే, మరో వైపు ఆయా శాఖల్లోనూ ప్రత్యేకంగా రుణాలకు ప్లాన్ చేయడం ఆందోళన కలిగిస్తోంది. లక్షల కోట్ల రుణాన్ని తీర్చలేక, అరకొర ఆదాయ వనరులతో బతుకుబండి సాగిస్తున్న సర్కారు… పట్టణాభివృద్ధి కోసం కూడా ప్రత్యేక అప్పులు తీసుకోవటం ఖజానాపై విపరీత భారాన్ని మోపనుంది. అయినా వెనకడుగేయకుండా రుణం ఇచ్చే సంస్థలతో రాయబారాలు నడిపి, అప్పులు పొందేందుకు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కన్సల్టెన్సీని నియమించినట్టు సమాచారం. రుణం ఇచ్చే సంస్థలతో మాట్లాడి, వీలైనంతమేరకు ఎక్కువ అప్పులు తీసుకురావడం దీని పని. ప్రపంచబ్యాంక్, హడ్కోతోపాటు అనేక ప్రయివేటు సంస్థలతో సంప్రదింపులు జరపడం, తక్కువ వడ్డీకి ఎక్కువ రుణాన్ని తీసుకురావడమే లక్ష్యంగా కన్సల్టెన్సీ బాధ్యత తీసుకున్నది.
కేంద్రం గ్రీన్ సిగ్నల్
దేశంలో పట్టణాల్లో జనాభా వేగంగా పెరుగుతున్నది. ఫలితంగా పట్టణాలు బాగా విస్తరిస్తున్నాయి. పెరుగుతున్న పట్టణ జనా భాకు మౌలిక సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ఆయా రాష్ట్రాలపై ఉన్నది. అందుకు కేంద్ర ప్రభుత్వ సాయం కూడా తోడైతే పట్టణాలు అద్దంలా తయారవుతాయి. కానీ మోడీ సర్కారు ఇందుకు ససేమిరా అంటోం ది. ఇదే సమయంలో పట్టణాభివృద్ధి కోసం అప్పులు తీసుకోవాలంటూ కేంద్రం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఈ క్రమంలో రాష్ట్రాల మంత్రులు, ఉన్నతాధికారులతో సమా వేశాలను నిర్వహిస్తోంది. అప్పులపై అవగా హన కల్గిస్తోంది. రాష్ట్రాలు ఎక్కడికక్కడ రుణాలు తెచ్చుకునేందుకు ప్రాజెక్టు రిపోర్టుల తయారీపై కూడా కేంద్రం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినట్టు తెలిసింది. రాష్ట్రంలో మున్సిపల్ శాఖ అధి కారులు కూడా ఈ సమావేశాలకు హాజర య్యారు. రుణం పొందేందుకు వీలుగా వారు ప్రాజెక్టు రిపోర్టులపై తెగ చర్చలు చేస్తున్నారు. చివరికి ప్రపంచ బ్యాంకు నుంచి పదివేల కోట్లు రుణం తీసుకోవాలని మున్సిపల్ శాఖ నిర్ణయించింది. అందుకు కేంద్రం రూ.4వేల కోట్లకు అనుమతి ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మొదటి దశలో రూ. 2,800 కోట్లను ప్రతిపాదించినట్టు తెలిసింది. అందుకు కేంద్ర, రాష్ట ప్రభు త్వాలు జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసి తమ వాటాను చూపిం చాలని నిబంధన పెట్టింది. ఆ దిశగా అధికారులు కసరత్తులు మొదలుపెట్టారు.
రుణాలు దేనికోసం…?
పురపాలికల అభివృద్ధి పేరిట పెద్ద ఎత్తున రుణాలను తెచ్చేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఆ నిధులను ఎక్కడెక్కడ, ఎందుకోసం ఖర్చు చేస్తారనేది మాత్రం బయటకు వెల్లడించటం లేదు. ముఖ్యంగా వేగంగా పెరుగుతున్న పట్టణ జనాభాకు తాగునీరు, భూగర్భ డ్రయినేజీ, రహదారులు, వర్షపు నీటి కాల్వలు, మురుగునీటి శుద్ధి కేంద్రాలు, చెత్త నిర్వహణ వంటి మౌలిక సదుపాయాలను కల్పించేందుకు వేల కోట్లు కావాల్సి వస్తున్నది. అయితే మున్సిపల్ కార్పొ రేషన్లకు, మున్సిపాల్టీలకు అంత డబ్బు సమకూర్చుకునే అవకాశాలు లేవు. రాష్ట్ర బడ్జెట్లో నిధులు కేటాయించినప్పటికీ అది జీతభత్యాలకు మాత్రమే సరిపోతుంది. పట్టణాల్లో అభివృద్ధి వేగాన్ని పెంచాలంటే, రుణాలు తేవడం తప్ప మరో మార్గం లేదని అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఆస్తి పన్నులు, యూజర్ చార్జీలు వసూలు చేసినా, మున్సిపాల్టీల నిర్వహణ ఖర్చులకే పరిమితమవుతోంది. దీంతో కొత్త ప్రాజెక్టుల కోసం రుణాలే మార్గంగా మారుతు న్నాయన్నది అధికారుల వాదన.
అంకెల్లోనే
బడ్జెట్ కేటాయింపులు
రాష్ట్రంలో7 మున్సిపల్ కార్పొరేషన్లు, 125 మున్సిపాల్టీలు ఉన్నాయి. వీటిలో సగానికి పైగా జనాభా మున్సిపాల్టీల్లో జీవిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ కేటాయింపుల్లో మాత్రం పురోగతి లేదు. 2025లో మున్సిపాల్టీల్లో మౌలిక సదుపాయాల కోసం ప్రభుత్వం రూ. ఏడువేల కోట్లు కేటాయించింది. ఇవి కాకుండా మౌలిక సదుపాయాల కల్పన పేరిట రూ. 2,780 కోట్లను 2,432 పనుల కోసం మంజూరు చేసింది. కానీ బడ్జెట్ విడుదలకు నోచుకోలేదని ఉన్నతస్థాయి అధికారులు చెబుతున్నారు. 2026-2027 బడ్జెట్లో రూ. 9,229 కోట్లను సర్కారు కేటాయించింది. కానీ నిధులు లేవనే నెపంతో విడుదల చేయడం లేదు. దీంతో బడ్జెట్ లో ఘనంగా చూపించి, ఆ మేరకు ఖర్చు చేయడం లేదనే విమర్శలు ఊపందుకున్నాయి. దీంతో కొత్త ప్రాజెక్టులకు రూపకల్పన జరగడం లేదు. కేవలం రోజువారీ పనులకే మున్సిపాల్టీలు పరిమితమవుతున్నాయి. కాగా అప్పులతో అభివృద్ధి చేస్తామని చెబుతూ… వాటిని తీర్చేందుకు ప్రజలపై యూజర్ చార్జీలు వేసి వసూలు చేసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


