– మంత్రుల ప్రసన్నానికి అసెంబ్లీలో మకాం
– నియామకాలు నేటికి వాయిదా
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
రాష్ట్ర సాగునీటి పారుదల, ఆయకట్టు శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్(జనరల్) పోస్టుకు గట్టిపోటీ కనిపిస్తున్నది. ఆ పోస్టును దక్కించుకునేందుకు పలువురు ఈఎన్సీలు ప్రయత్నిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో వారంతా అక్కడే తిష్ట వేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు నేపథ్యంలో సంబంధిత ఇన్ఛార్జీ ఈఎన్సీ ఎన్.వెంకటేశ్వర్లును సర్వీసు నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. అలాగే ఈఎన్సీ జనరల్గా ఉన్న సి మురళీధర్రావును రాజీనామా చేయాలని ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో ఆయన గురువారం రాత్రి సాగునీటి శాఖ కార్యదర్శి రాహుల్బొజ్జాకు లేఖ పంపారు. దీంతో ఇప్పుడు ఆ రెండు పోస్టులు ఖాళీ అయ్యాయి. కాగా ఈఎన్సీ జనరల్ పోస్టు కోసం ఈఎన్సీ(అడ్మిన్)గా ఉన్న అనిల్కుమార్తోపాటు నాగేందర్, హరిరామ్, శంకర్ పేర్లు వినిపిస్తున్నాయి. అలాగే కామారెడ్డి సీఈ సుధాకర్రెడ్డి సైతం తనవంతు ప్రయత్నం చేస్తున్నట్టు తెలిసింది.
ఆ పోస్టు సుధాకర్రెడ్డికి దక్కాలంటే ఆయన పోస్టును అప్గ్రేడ్ చేయాల్సి ఉంటుందని సమాచారం. అలాగే డిజైన్ విభాగంలో ఉన్న సీఈ అనంద్కుమార్ సైతం ఆశిస్తున్నట్తు తెలిసింది. వీరిలో ముగ్గురు ఈఎన్సీలు శుక్రవారం అసెంబ్లీకి వచ్చారు. ఎవరికివారు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. అయితే ఇందులో అడ్మిన్గా ఉన్న అనిల్కుమార్కే ఎక్కువ అవకాశం ఉన్నట్టు తెలిసింది. ఆయనను వద్దనుకుంటే నాగేందర్కు దక్కే పరిస్థితి ఉన్నట్టు అధికారిక సమాచారం. అనిల్కుమార్ కాళేశ్వరం పనుల విషయంలో గతంలో ‘డిసెంట్’ రాసి కాస్త కఠినంగా వ్యవహరించారనే పేరుంది.
అందుకే సర్కారు ఆయనవైపు మొగ్గుచూపే అవకాశాలు ఉన్నట్టు జలసౌధ వర్గాలు చెబుతున్నాయి. కాళేశ్వరం ఈఎన్సీ బాధ్యతను ఇప్పుడున్న సీఈల్లో సీనియర్ను నియమించే అవకాశముంది. ఈ రెండు పోస్టుల నియామకం శనివారానికి ప్రభుత్వం వాయిదా వేసింది.
అసలు ఆ పోస్టు ఎందుకు ?
నీటిపారుదల శాఖలో ఈఎన్సీలు ఆరుగురు ఉంటారు. ఇందులో ఇప్పుడు రెండు పోస్టులు ఖాళీ అయ్యాయి. సీఈలకు కొదవ లేదు. జిల్లాకు ఒకరు చొప్పున పనిచేస్తున్నారు. వీరికి ఆయా బాధ్యతలు అప్పగించారు. కొన్ని జిల్లాలకు ఇద్దరు, ముగ్గురు ఉండటం తెలిసిందే. ఆయా జిల్లాల్లో ప్రాజెక్టులు, పనులను బట్టి పోస్టులను సృష్టించిన సంగతి తెలిసిందే. సాధారణంగా మొదట ఈఎన్సీ జనరల్ పోస్టు లేదు. మురళీధర్రావు తన పలుకుబడితో ఈఎన్సీలంతా తన ద్వారా కార్యకలాపాలు నిర్వహించేందుకు ప్రభుత్వంలో పైరవీ చేసి ఈఎన్సీ(జనరల్) పోస్టును సృష్టించుకున్నట్టు సమాచారం. ఆయనతోపాటు ఉన్న ఈఎన్సీలకు అనుభవం లేదనే సాకుతో సర్కారులో చక్రం తిప్పి, ఈఎన్సీ జనరల్గా బాధ్యతల్లోకి వచ్చారు. దీంతో మిగతా ఈఎన్సీలపై ఈఎన్సీ జనరల్ పోస్టు ద్వారా పైచేయి సాధించారు. సర్కారు ఈ పరిస్థితిని అధ్యయనం చేసింది. తొలినాళ్లల్లో ఉన్న విధానాన్నే కొనసాగించాలనే ఆలోచన చేస్తున్నట్టు తెలిసింది. ప్రత్యేకంగా ఈఎన్సీ జనరల్ పోస్టు అవసరమా ? ఈఎన్సీలందరికీ ఒకే రకమైన అధికారాలు ఉన్నప్పుడు ఆపోస్టు అనవసరమేంటి అనే భావనలో ఉంది. మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి సైతం ఈ విషయమై సమాలోచనలు చేస్తున్నట్టు తెలిసింది. అధికారాలను అందరికి సమానంగా పంచేసి విధులను నిర్వర్తింపచేయాలని అనుకున్నట్టు సమాచారం. ఆరుగురు ఈఎన్సీలు నేరుగా సాగునీటి శాఖ ముఖ్యకార్యదర్శికి రిపోర్టు చేసేలా అధికారాల్లో మార్పులు చేయాలా ? లేక యధావిధిగా ఈఎన్సీ జనరల్ పోస్టును కొనసాగించాలా ? అనే విషయంలో మంత్రి, ముఖ్యకార్యదర్శి స్థాయిలో తర్జనభర్జన పడుతున్నట్టు సమాచారం.