నవతెలంగాణ-ఆలేరు టౌను
ఆలేరు మున్సిపల్ అభివృద్ధి విషయంలో మాట్లాడితే, మున్సిపల్ చైర్మన్, వారి మనుషులు బెదిరింపులకు దిగితే సహించేది లేదని, 1,3,4 మున్సిపల్ వార్డు ల కౌన్సిలర్లు పాకాల మౌనిక హరీష్, యాట శివ, బిజన కళ్యాణి మధు అన్నారు. మున్సిపల్ కార్యాలయం వద్ద మంగళవారం జెండా ఆవిష్కరణ అనంతరం జరిగిన ఘర్షణ నేపథ్యంలో ఆలేరు పట్టణంలో మంగళవారం అతిధి గృహం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ మున్సిపల్ చైర్మన్ బీజనా బాలమణి చేస్తున్న అభివృద్ధిని, మేము అడ్డుకుంటున్నామని చెప్పడం సరికాదన్నారు.
బీజన కళ్యాణి మాట్లాడుతూ తను కౌన్సిలర్ గా పోటీ చేస్తున్న తరుణంలో తన భర్త ఎంతో వెన్నుదన్నుగా ధైర్యం చెప్పి పోటీలో నిలబెట్టి ప్రజల్లోకి వెళ్లి గెలిపించారని గుర్తు చేశారు. చైర్మన్ భర్త మున్సిపల్ ఆఫీస్ కు వస్తే లేని తప్పు, తన భర్త వస్తే తప్పేంటని ప్రశ్నించారు. ఐదో వార్డ్ కౌన్సిలర్ పాషికంటి సంపత్ మాట్లాడుతూ ప్రతిపక్ష మహిళ కౌన్సిలర్లని, వారి భర్తలని అవమానించడం సరికాదన్నారు. అభివృద్ధి చేద్దామని, పంచాయతీలు వద్దని ఇతవు పలికారు.
బిఆర్ఎస్ నాయకులు బీజన మధు మాట్లాడుతూ నన్ను అవమానించిన వారిపై పోలీసులు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. తనకు న్యాయం జరిగే వరకూ ఉద్యమిస్తామని, జిల్లా కలెక్టర్ ను సంప్రదిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.



