నవతెలంగాణ-హైదరాబాద్ : సూర్యాపేట జిల్లా కేంద్రానికి సమీపంలో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మోతేకు దగ్గరలో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ఓ బస్సు ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలోని ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరో తొమ్మిది మందికి గాయాలయ్యాయి. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టానికి పంపించారు. ప్రమాద సమయంలో ఆటోలో మొత్తం 12 మంది ఉన్నారని, వారంతా కూలీ పనుల కోసం వెళ్తుండగా ప్రమాదం బారినపడ్డారని పోలీసులు తెలిపారు.