జూన్ 21 వరకు లాక్డౌన్లో
ప్రశ్నాపత్రం తయారీ నిపుణులు, రూపకర్తలు
ఫోన్లు, ల్యాప్టాప్లు, ఇంటర్నెట్కు పూర్తిగా దూరం
పేపర్ లీక్ పునరావృతం కాకుండా చర్యలు
న్యూఢిల్లీ : నీట్-యూజీ 2026 రీ-ఎగ్జామినేషన్ను ఎలాంటి వివాదాలు లేకుండా నిర్వహించేందుకు కేంద్రం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)లు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాయి. జూన్ 21న జరగనున్న నీట్ రీ-ఎగ్జామ్ ప్రశ్నాపత్రం తయారీలో పాల్గొంటున్న నిపుణులు, మోడరేటర్లు, అనువాదకులను రహస్య ప్రదేశంలో పూర్తిగా బాహ్య ప్రపం చానికి దూరంగా ‘లాక్డౌన్’లో ఉంచినట్టు సమాచారం. పేపర్ లీక్ అవకాశాలను పూర్తిగా నివారించడమే ఈ చర్యల ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు.
బయటి ప్రపంచంతో సంబంధాలు కట్
గతనెలలో నిర్వహించిన నీట్-యూజీ పరీక్షలో ప్రశ్నాపత్రం లీక్ ఆరోపణలు దేశవ్యాప్తంగా తీవ్ర వివాదానికి దారి తీశాయి. దాదాపు 22 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం చూపిన ఈ ఘటన తర్వాత పరీక్షను రద్దు చేసి రీ-ఎగ్జామ్ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ప్రశ్నాపత్రం తయారీలో భాగస్వాములైన వారందరినీ అత్యంత భద్రత కలిగిన కేంద్రంలో ఉంచారు. వారి వద్ద మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, స్మార్ట్వాచ్లు వంటి కమ్యూనికేషన్ పరికరాలను అనుమతించడం లేదు. ఇంటర్నెట్ సదుపాయాన్ని పూర్తిగా నిలిపివేయడంతో పాటు బయటి వ్యక్తులతో సంబంధాలు కూడా కఠినంగా నియంత్రిస్తున్నారు. కేంద్రంలోకి ప్రవేశం, బయటకు వెళ్లడం వంటి ప్రతి కదలికనూ నమోదు చేస్తూ పర్యవేక్షిస్తున్నారు. ప్రశ్నాపత్రం తయారీ మాత్రమే కాకుండా అనువాదం, మోడరేషన్, ముద్రణ, ప్యాకేజింగ్, నిల్వ, రవాణా, పంపిణీ వంటి ప్రతి దశపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు. మొత్తం ప్రక్రియను విభాగాలుగా విభజించడం ద్వారా ఒక వ్యక్తి లేదా ఒక బృందానికి మొత్తం వ్యవస్థపై పూర్తి సమాచారం అందకుండా చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. దీంతో లీక్లకు అవకాశం తగ్గుతుందని భావిస్తున్నారు.
ప్రశ్నాపత్రాల రవాణాకు భారత వైమానిక దళం విమానాలు!
ఇక ప్రశ్నాపత్రాల రవాణా కూడా ఈసారి అత్యంత సున్నితమైన అంశంగా మారింది. పేపర్లను దేశవ్యాప్తంగా తరలించేందుకు భారత వైమానిక దళం విమానాల వినియోగం సహా ప్రత్యేక భద్రతా ఏర్పాట్లను ప్రభుత్వం పరిశీలించినట్టు సమాచారం. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ, ఎన్టీఏ అధికారులు గత పరీక్షలో బయటపడిన బలహీనతలను సమీక్షించి పలు స్థాయిల్లో కొత్త భద్రతా చర్యలను అమలు చేస్తున్నట్టు చెప్పారు. ప్రశ్నాపత్రం లీక్పై వదంతులు
నమ్మొద్దు : ఎన్టీఏ
కాగా రీ-ఎగ్జామ్ ప్రశ్నాపత్రం ఇప్పటికే లీక్ అయిందంటూ సోషల్ మీడియా, టెలిగ్రామ్ ఛానళ్లలో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలను ఎన్టీఏ పూర్తిగా ఖండించింది. ఇవన్నీ తప్పుడు, నిరాధార, మోసపూరిత ప్రచారాలేనని స్పష్టం చేసింది. ఇలాంటి వదంతులను నమ్మవద్దని విద్యార్థులు, తల్లిదండ్రులకు సూచించింది. ప్రశ్నా పత్రాలు విక్రయిస్తున్నట్టు తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుం టామని హెచ్చరించింది. సోషల్ మీడియా వేదికలు, మెసేజింగ్ యాప్లు, ఆన్లైన్ ఫోరమ్లపై 24 గంటల నిఘా కొన సాగుతోందని అధికారులు తెలిపారు.
21న 551 నగరాల్లో రీ-ఎగ్జామ్
ఈనెల 21న మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.15 గంటల వరకు దేశవ్యాప్తంగా 551 నగరాల్లో నీట్-యూజీ రీ-ఎగ్జామ్ను నిర్వహించనున్నారు. గత వివాదాల తర్వాత ఎన్టీఏ విశ్వసనీయతపై ప్రశ్నలు తలెత్తిన నేపథ్యంలో ఈ రీ-ఎగ్జామ్ సంస్థకు, ప్రభుత్వానికి ప్రతిష్ఠాత్మక పరీక్షగా మారింది. దీంతో ఈ పరీక్షను సజావుగా నిర్వహించడం మాత్రమే కాకుండా, విద్యార్థులు, తల్లిదండ్రుల్లో పరీక్షా వ్యవస్థపై మళ్లీ నమ్మకం కల్పించడం కూడా ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారిందని విశ్లేషకులు చెప్తున్నారు.
నీట్ రీ-ఎగ్జామ్కు కట్టుదిట్టమైన భద్రత
- Advertisement -
- Advertisement -



