– హాజరుకానున్న రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్
నవతెలంగాణ-మిర్యాలగూడ
నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాల్లో భాగంగా నేడు మిర్యాలగూడలో పార్లమెంటు స్థాయి మినీ మహానాడు నిర్వహిస్తున్నట్లు టీడీపీ జాతీయ క్రమశిక్షణ కమిటీ సభ్యులు, నియోజకవర్గ ఇన్చార్జి బంటు వెంకటేశ్వర్లు తెలిపారు. ఆదివారం మినీ మహానాడు జరిగే శ్రీమన్నారాయణ ఫంక్షన్ హాల్లో ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. నల్లగొండ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని మిర్యాలగూడలో ఈ మినీ మహానాడు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మినీ మహానాడుకు కోదాడ, హుజూర్నగర్, సూర్యాపేట, మిర్యాలగూడ, నాగార్జునసాగర్, నల్గొండ, దేవరకొండ నియోజకవర్గాల నుండి సుమారు 800 నుండి 1000 మంది ప్రతినిధులు హాజరవుతున్నట్టు తెలిపారు. ఈ మినీ మహానాడుకు టీడీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, పొలిట్ బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే భక్తిని నరసింహులు హాజరవుతున్నట్లు తెలిపారు. తెలుగు తమ్ములు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు వడ్డేనబోయిన శ్రీనివాస్, చిలుక వెంకన్న, రామ్రెడ్డి, మున్న వెంకటేశ్వర్లు, సైదులు, గోవిందు, సాయం సైదులు, రాజలింగం, కాశి, మచ్చ సైదులు, చామల వెంకటేశ్వర్లు, రమేష్ నాయక్, రావిరాల నాగేందర్, నసరుద్దీన్ బాబా తదితరులు పాల్గొన్నారు.