విషాదం..కూతురు వివాహమైన కొన్ని గంటల్లోనే తండ్రి మృతి

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : బిడ్డ పెండ్లిచేసిన సంతోషం ఆ తండ్రికి ఎంతో సేపు నిలువలేదు. కూతురి కాళ్ల పారాణి ఆరకముందే ఆ తండ్రి ఆయువు తీరింది. కూతురు వివాహమైన కొన్ని గంటల్లోనే తండ్రి గుండెపోటుతో మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన మంచిర్యాల జిల్లా చెన్నూర్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. చెన్నూర్‌ పట్టణంలోని మెయిన్‌ రోడ్‌లో ప్రిన్స్‌ కంగన్‌ హాల్‌-జనరల్‌ స్టోర్స్‌ నిర్వహిస్తున్న మహ్మద్‌ ఎజాజ్‌ ఆదివారం రాత్రి 8 గంటలకు తన పెద్ద కూతురు వివాహం జరిపించాడు. ఈ క్రమంలో సోమవారం తెల్లవారుజామున మూడు గంటలకు తన చాతిలో నొప్పి వస్తుందని ఫంక్షన్‌ హాల్‌ నుంచి ఇంటికి బయలుదేరాడు. అంతలోనే స్పృహ కోల్పోగా, వెంటనే దవాఖానకు తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. బంధుమిత్రులతో సందడిగా మారిన ఆ కుటుంబంలో ఒక్కసారిగా విషాదం నెలకొంది. ఎజాజ్‌ మరణంతో బంధువుల రోదనలు మిన్నంటాయి.

Spread the love