– జూలై 9, 10 తేదీల్లో మూడు కేంద్రాల్లో నిర్వహణ
– డీఆర్డీఓ విద్యా చందన వెల్లడి
నవతెలంగాణ – అశ్వారావుపేట
గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక (జీపీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక) రూపకల్పన, అమలుపై జిల్లాలోని సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు నియోజకవర్గాల వారీగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి (డీఆర్డీఓ) విద్యాచందన తెలిపారు. జూలై 9న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొత్తగూడెం క్లబ్లో కొత్తగూడెం, ఇల్లందు, వైరా నియోజకవర్గాలకు చెందిన సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అదే రోజు భద్రాచలంలోని వీరభద్ర ఫంక్షన్ హాల్ లో భద్రాచలం, పినపాక నియోజకవర్గాలకు చెందిన ప్రజాప్రతినిధులు, కార్యదర్శులకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.
జూలై 10న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పట్వారిగూడెంలోని చలికాని ఆదమ్మ ఫంక్షన్ హాల్లో అశ్వారావుపేట నియోజకవర్గానికి చెందిన సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక తయారీ, గ్రామ అవసరాల గుర్తింపు, ప్రాధాన్యతల నిర్ణయం, అభివృద్ధి కార్యక్రమాల రూపకల్పన, ప్రభుత్వ మార్గదర్శకాల అమలుపై ఈ శిక్షణలో సమగ్ర అవగాహన కల్పించనున్నట్లు డీఆర్డీఓ విద్యాచందన తెలిపారు. సంబంధిత నియోజకవర్గాలకు చెందిన సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు నిర్ణీత తేదీ, సమయానికి ఆయా శిక్షణా కేంద్రాలకు తప్పనిసరిగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆమె కోరారు.



