ట్రాన్స్ జెండర్లను సాటి మనుషులుగా గౌరవించాలి

– హైకోర్టు న్యాయమూర్తి పి.శ్రీసుధ
– ఘన స్వాగతం పలికిన జిల్లా జడ్జి, కలెక్టర్
నవతెలంగాణ – కంటేశ్వర్
ట్రాన్స్ జెండర్లను సాటి మనుషులుగా గుర్తిస్తూ వారి పట్ల గౌరవప్రదంగా వ్యవహరించాలని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.శ్రీసుధ హితవు పలికారు. జిల్లా కోర్టు భవన సముదాయంలో న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ట్రాన్స్ జెండర్లు, సెక్స్ వర్కర్లకు పోస్టల్ శాఖ ద్వారా అమలవుతున్న గ్రూప్ ఆక్సిడెంటల్ పాలసీ బాండ్ లను శనివారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హైకోర్టు జడ్జి శ్రీసుధ, ట్రాన్స్ జెండర్ల సమస్యలను హృద్యంగా చిత్రీకరిస్తూ అష్ట గంగాధర్ రూపొందించిన వీడియోతో కూడిన పాటను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జస్టిస్ శ్రీసుధ మాట్లాడుతూ, ట్రాన్స్ జెండర్ల పట్ల వివక్ష చూపడం ఎంతమాత్రం తగదని, రాజ్యాంగంలో కూడా ఇదే విషయం ప్రస్తావించబడిందని అన్నారు. ట్రాన్స్ జెండర్లను అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తూ, వారికి సమాన అవకాశాలు లభించేలా కృషి చేయాలన్నారు. పోస్టల్ శాఖ ద్వారా కేవలం రూ. 399 ప్రీమియం తో 10 లక్షల రూపాయల ప్రమాద బీమాతో పాటు ఇతర అనేక ప్రయోజనాలు కలిగి ఉన్న గ్రూప్ ఆక్సిడెంటల్ పాలసీ గార్డ్ ను ట్రాన్స్ జెండర్లు, సెక్స్ వర్కర్లకు వర్తింపజేయడం అభినందనీయమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ప్రతినిధులను ప్రశంసించారు. ఇతర సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ డీ.ఎల్.ఎస్.ఏ ముందంజలో నిలుస్తోందని కొనియాడారు. భవిష్యత్తులో మరింత విస్తృత స్థాయిలో సేవా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. సాంకేతిక అభివృద్ధి కారణంగా నేటి సమాజంలో అనేక మంది పోస్టల్ శాఖను మర్చిపోయారని, ఫలితంగా ఆ శాఖ ద్వారా అమలవుతున్న ప్రమాద బీమా వంటి ప్రయోజనాలను పొందలేకపోతున్నారని అభిప్రాయపడ్డారు. తక్కువ ప్రిమియంతో ఎక్కువ ప్రయోజనాలు అందిస్తున్న పోస్టల్ శాఖ ప్రమాద బీమా పాలసీ గురించి విస్తృత ప్రచారం నిర్వహిస్తూ, అర్హులైన ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకునేలా చూడాలని అధికారులకు సూచించారు. జిల్లా జడ్జి కె.సునీత మాట్లాడుతూ, ట్రాన్స్ జెండర్లు, సెక్స్ వర్కర్లకు ఏదైనా మేలు చేకూర్చాలని తలంపుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. దాతలు ముందుకు వచ్చి సుమారు రూ. 30 వేలు విరాళం అందించగా, దానిని ప్రీమియం కోసం వెచ్చిస్తూ 50 మంది ట్రాన్స్ జెండర్లు, సెక్స్ వర్కర్లకు ఉచితంగా బీమా బాండ్లు అంద ల్లా న్యాయసేవ అధికార సంస్థ జేయడం జరిగిందన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో చేపడుతున్న సామాజిక కార్యక్రమాలకు జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో సహకరిస్తోందని అన్నారు. ఈ కార్యక్రమం అనంతరం హైకోర్టు జడ్జి న్యాయాధికారులతో భేటీ అయ్యి పలు అంశాలపై చర్చించారు.
హైకోర్టు జడ్జికి ఘన స్వాగతం
హైకోర్టు జడ్జి బి.శ్రీసుధ శనివారం నిజామాబాద్ పర్యటనకు హాజరైన సందర్భంగా జిల్లా ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు.ముందుగా ఆమె స్థానిక రోడ్లు – భవనాల శాఖ అతిథి గృహం వద్దకు చేరుకోగా, జిల్లా జడ్జి కె.సునీత, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, ట్రైనీ అడిషనల్ కలెక్టర్ కిరణ్మయి, నిజామాబాద్ ఆర్దీవో రవి, అదనపు సీ.పీ మధుసూదన్ రావు, జిల్లా న్యాయ సేవాదికార సంస్థ కార్యదర్శి పద్మావతి, రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు రాజేందర్ రెడ్డి, ఆయా శాఖల జిల్లా అధికారులు, న్యాయ శాఖ అధికారులు, న్యాయవాదులు, బార్ అసోసియేషన్ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కలు అందించి స్వాగతం పలికారు. అనంతరం జిల్లా జడ్జి, కలెక్టర్, అదనపు కలెక్టర్లతో హైకోర్టు న్యాయమూర్తి అతిథి గృహంలో కొద్దిసేపు భేటీ అయ్యారు. అంతకు ముందు ఆమె పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు.

Spread the love