నవతెలంగాణ- హైదరాబాద్: తొలిసారి ఉక్రెయిన్ భారీ స్థాయిలో దాడికి దిగినట్టు భావిస్తున్నారు. రష్యన్ నేలపై కీవ్ దళాలు తమ ఉదృతిని పెంచాయి. మోరోజోవెస్కీ జిల్లాలో సుమారు 40 డ్రోన్లను అడ్డగించి, ధ్వంసం చేసినట్లు రష్యా రక్షణ దళం పేర్కొన్నది. బోర్డర్ నుంచి సుమారు వంద కిలోమీటర్ల లోపలికి ఆ డ్రోన్లు చొచ్చుకు వచ్చినట్లు రష్యా రక్షణ దళం తెలిపింది. ఆ అటాక్లో ఓ పవర్ స్టేషన్ ధ్వంసమైంది. డ్రోన్ల దాడి వల్ల మోరోజోవెస్కీ వద్ద ఉన్న వైమానిక క్షేత్రానికి ఎటువంటి నష్టం జరిగిందన్న విషయం ఇంకా తెలియరాలేదు. కుర్స్క్, బెల్గొరోడ్, క్రాస్నడోర్ ప్రాంతాల వద్ద మరో 9 డ్రోన్లను కూల్చినట్లు రష్యా తెలిపింది.ఉక్రెయిన్ డ్రోన్ దాడిలో ఆరు రష్యా విమానాలు ధ్వంసం అయినట్లు తెలుస్తోంది. దీంతో పాటు 8 మందికి గాయాలు అయ్యాయి. మరో వైపు రష్యా చేసిన డ్రోన్ దాడిని ఉక్రెయిన్ తిప్పికొట్టింది. ఇవాళ 13 రష్యా డ్రోన్లను కూల్చివేసినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది.