కొరివితో తలగోక్కుంటున్న ఉక్రెయిన్‌

– రష్యా సరిహద్దు ప్రాంతాల ఆక్రమణకు యత్నం
–  ప్రతీకార దాడులతో విరుచుకుపడుతున్న రష్యా
మాస్కో : అమెరికా, నాటో దేశాల చేతిలో కీలుబొమ్మగా మారిన ఉక్రెయిన్‌ అక్కడి ప్రజల ప్రాణాలను సైతం పణంగా పెడుతోంది. రష్యా సరిహద్దు ప్రాంతాలను ఆక్రమించేందుకు యత్నిస్తూ భారీ మూల్యం చెల్లిస్తోంది. ఈ పరిణామాలతో ఉక్రెయిన్‌లోని పలు నగరాలపై రష్యా మళ్లీ సైనిక ఆపరేషన్‌ చేపట్టింది.ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌లోని పశ్చిమ, దక్షిణ భాగాలపై దాడులు నిర్వహించింది. ఈ దాడిలో చాలా వాహనాలు ధ్వంసమయ్యాయి. ప్రజలు షెల్టర్లలోనే ఉండాలని కీవ్‌ మేయర్‌ అభ్యర్థించారు. నగరంలో ప్రతి 10 ఇళ్లలో నాలుగు చోట్ల విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. ఈ విషయాన్ని ఉక్రెయిన్‌ రక్షణశాఖ ధ్రువీకరించింది. రష్యాకు చెందిన 34 క్షిపణులను, షాహిద్‌ డ్రోన్లను కూడా కూల్చివేసినట్లు వెల్లడించింది. అయితే సరిహద్దు ఆక్రమణకు ఉక్రెయిన్‌ పాల్పడుతున్నందునే సైనిక దాడులు చేయాల్సివస్తోందని రష్యా ప్రకటించింది. కాగా రష్యా స్వాధీనంలో ఉన్న జపోరిజియా అణు విద్యుత్తు కేంద్రానికి ఉక్రెయిన్‌ విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. ఈ విషయాన్ని అణుకేంద్రం నిర్వహిస్తున్న ఎనర్గోఆటమ్‌ ఉద్యోగి ఒకరు వెల్లడించారు. అణువిద్యుత్తు కేంద్రానికి ఉక్రెయిన్‌ విద్యుత్తు సరఫరా నిలిపివేయడం కవ్వింపు చర్యే అని రష్యా వ్యాఖ్యానించింది. రేవు నగరమైన ఒడెస్సాలో విద్యుత్తు వ్యవస్థలపై భారీగా క్షిపణి దాడులు జరిగాయి. దీంతో చాలా చోట్ల విద్యుత్తు సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. జనవరి తర్వాత ఉక్రెయిన్‌పై జరిగిన రష్యా ఇంత భారీ స్థాయిలో సైనిక చర్యకు పాల్పడటం ఇదే తొలిసారి.

Spread the love