– మిజోరంలో మెయితేల భయాందోళనలు
– రాష్ట్రం విడిచి వెళ్లడానికి యత్నాలు
న్యూఢిల్లీ : మణిపూర్లో హింసాకాండ మిజోరంలో నివసిస్తున్న మెయితేల గ్రూపు ప్రజల్లో భయాందోళనలను కలిగిస్తుంది. దీంతో మిజోరం రాష్ట్రం విడిచివెళ్లాని వీరు భావిస్తున్నారు. అందకు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. మిజో నేషనల్ ఫ్రంట్ మిలిటెంట్స్కు చెందిన పీస్ అకార్డ్ ఎంఎన్ఎఫ్ రీటర్నీస్ అసోసియేషన్ (పిఎఎంఆర్ఎ) ఈ నెల 21న ఒక ప్రకటన విడుదల చేసిన దగ్గర నుంచి ఈ ఆందోళనలు ఎక్కువయ్యాయి. మిజోరంలో నివసిస్తున్న మెయితేలు తమ భద్రత కోసం రాష్ట్రం విడిచి వెళ్లాలని పిఎఎంఆర్ఎ ప్రకటనలో విజ్ఞప్తి చేసింది. మిజోరం రాష్ట్రం నుంచి మెయితేలను తీసుకునిరావడానికి ఛార్టెర్ట్ విమానాలు ఏర్పాటు చేస్తామని మణిపూర్ ప్రభుత్వం చెబుతోంది. అయితే మరోవైపు మిజోరంలో మెయితేల భద్రతకు ఎలాంటి ప్రమాదం లేదని మిజోరం రాష్ట్ర హోం శాఖ ప్రకటించింది. శాంతిభద్రతలు కాపాడ్డం కోసం ముందు జాగ్రత్తగా మిజోరం యూనివర్శిటీ, వేటీ కాలేజ్, ఫాల్కావన్ ప్రాంతాల్లో భద్రతా దళాలను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. మిజోరంలో ఉండే స్థానిక గ్రూపు మిజోలకు మణిపూర్లో కుకిలతో బంధుత్వం ఉంది. ఈ కారణంతో మణిపూర్లో హింసాకాండ ప్రారంభమైన దగ్గర నుంచి మిజోరంలో సుమారు 13 వేల మంది కుకీలు తలదాచుకుంటున్నారు. మరోవైపు మిజోరంలో సుమారు 2 వేల మంది మెయితేలు ఉంటారని అంచనా. వీరిలో ఎక్కువ మంది ఐజ్వాల్లో ఉంటారు.