– బీడీ కార్మికులందరికీ జీవన భృతి ఇవ్వాలి
– కేసీఆర్ ఇచ్చిన హామీని అమలు చేయాలి :
– తెలంగాణ బీడీ, సిగార్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) జిల్లా కార్యదర్శి నూర్జహాన్
నవతెలంగాణ-కంఠేశ్వర్
సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు బీడీ పరిశ్రమలో పని చేసే ప్యాకర్స్, గంప చాటాన్ బట్టి, బీడీ కార్మికులందరికీ ఎలాంటి ఆంక్షలూ లేకుండా జీవనభృతి అమలు చేయాలని తెలంగాణ బీడీ, సిగార్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) జిల్లా కార్యదర్శి నూర్జహాన్ డిమాండ్ చేశారు. బుధవారం నిజామాబాద్ కలెక్టర్ కార్యాలయం ఎదుట యూనియన్ ఆధ్వర్యంలో బీడీ ప్యాకర్లు ధర్నా చేపట్టి అనంతరం ఏవోకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం బీడీ పరిశ్రమలో పనిచేస్తూ పీఎఫ్ ఉన్న ప్రతి ఒక్కరికీ జీవన భృతి అమలు చేస్తామని చెప్పారని, కానీ జిల్లాలో ప్యాకర్స్ కార్మికులకు అమలు కావడం లేదని తెలిపారు. పరిశ్రమలో పనిచేసే కార్మికులు అనేకసార్లు వినతి పత్రాలు, ధర్నాలు, రాస్తారోకోలు, వ్యక్తిగత దరఖాస్తులు పెట్టుకొని విసిగిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలని, లేనియెడల పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గడ్డం మోహన్, ప్యాకర్స్ జిల్లా నాయకులు జమీల్, విశ్వనాధ్, నారాయణ, మైనుద్దీన్, ప్రమీల, మోహన్ రామచందర్, హమీద్ హైమద్, దేవదాస్ గని, రజాక్ చిన్నయ్య, రవి, గణేష్, లింగం శ్రీనివాస్ సాయిలు తదితరులు పాల్గొన్నారు.