నవతెలంగాణ-కాటారం
కేంద్ర ప్రభుత్వం మహిళా బిల్లును వెంటనే పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదించాలని టీపీసీసీ మహిళా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆంగోత్ సుగుణ డిమాండ్ చేశారు. ఏఐసీసీ పిలుపుమేరకు మహిళా బిల్లు ఆమోదం కోసం చేపట్టిన పోస్ట్కార్డు ఉద్యమాన్ని శనివారం కాటారంలో ఏఎంసీ చైర్పర్సన్ పంతకాని తిరుమలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కాటారం మండలంలోని దుబ్బగూడం, గంటగూడెం, జీయర్వాడ గ్రామాల్లో మహిళలను కలిసి పోస్ట్కార్డులను పంపిణీ చేశారు. మహిళా బిల్లుకు మద్దతుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి పోస్టు కార్డులు పంపించాలని మహిళలను కోరారు.
ఈ సందర్భంగా ఆంగోత్ సుగుణ మాట్లాడుతూ మహిళా బిల్లుపై కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికీ బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందేదని విమర్శించారు. ఆకాశంలోనూ, భూమిపైనూ సగం సృష్టికి మూలం మహిళేనని, అలాంటి మహిళలను చిన్నచూపు చూస్తున్న బీజేపీ ప్రభుత్వానికి రానున్న ఎన్నికల్లో మహిళలే తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మహిళా నాయకురాళ్లు దొంగిరి లక్ష్మి, బీరెల్లి సమ్మక్క, జీయర్ రజిత, కొండగోర్ల సమ్మక్క శ్రీలత తదితరులు పాల్గొన్నారు.



