– ఆధార్ ఆధారిత చెల్లింపులకు కేంద్రం ఉత్తర్వు
– 57శాతం మందికి పని నిరాకరణ
న్యూఢిల్లీ : ఉపాధి హామీ పథకంపై కేంద్ర ప్రభుత్వం మరో కత్తిపోటు పొడిచింది. ఉపాధి హామీని నిర్వీర్యం చేసేందుకు మోడీ ప్రభుత్వం ఇప్పటికే డిజిటల్ హాజరును తప్పనిసరి చేసింది. అలాగే ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఉపాధి హామీకి కేటాయిపులను రూ.30 వేల కోట్లకు తగ్గించింది. ఇప్పుడు.. ఆధార్ ఆధారిత వేతన చెల్లింపులకు సిద్ధమైంది. దీంతో ప్రభుత్వ డేటా ప్రకారమే 57శాతం మంది కార్మికులు వేతనాలకు దూరమవుతారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం 100 రోజుల ఉద్యోగ పథకం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టం కింద వేతనాల పంపిణీకి ఆధార్-రూటెడ్ చెల్లింపు వ్యవస్థను తప్పనిసరి చేసింది. ఈ మేరకు కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ జనవరి 30న అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖ రాస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ‘రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో (యూటీలు) మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఎస్) ప్రభావవంతంగా అమలు చేయబడుతుందని మీకు తెలుసు. కాబట్టి, ఈ పథకం కింద లబ్ధిదారులకు అన్ని చెల్లింపులు ఏబీపీఎస్ ద్వారా మాత్రమే చేయాలి. ఇవి తప్పనిసరిగా అమలుచేయాలి. ఈ విషయంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ క్రమం తప్పకుండా అవగాహన కల్పిస్తోంది’ అని మంత్రిత్వ శాఖ డైరెక్టర్ ధరంవీర్ ఝా లేఖలో పేర్కొన్నారు. ఈ నిర్ణయం 2023 ఫిబ్రవరి 1 నుంచి అమలులోకి వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కార్మికులు తమ ఖాతాను తమ ఆధార్ నంబర్తో లింక్ చేయమని వారి బ్యాంకులను అభ్యర్థించాలి. కేవైసీ వివరాలను సమర్పించిన తరువాత ఖాతాను నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి. ఈ ప్రక్రియలో ఖాతాదారుని బయోమెట్రిక్ ప్రమాణీకరణ కూడా ఉంటుంది. 43శాతం మంది కార్మికులకు మాత్రమే ఏబీపీఎస్ సౌకర్యం ఉంది. ఉపాధి హామీ అమలును నిశితంగా పరిశీలిస్తున్న జీన్ డ్రేజ్ వంటి ఆర్థికవేత్తలు, 57శాతం మంది కార్మికులు ఆధార్-ఆధారిత చెల్లింపు వ్యవస్థ (ఏబీపీఎస్)లో భాగం కారని చెప్పారు. ఇది సంక్లిష్ట నమోదు ప్రక్రియని పేర్కొంటున్నారు. ప్రతి గ్రామీణ కుటుంబానికి సంవత్సరానికి 100 రోజుల వరకు పని కల్పించే జాతీయ ఉపాధి పథకం కింద ప్రజలను పని డిమాండ్ చేయకుండా నిరోధించడానికి మోడీ ప్రభుత్వం తీసుకున్న మరో అడుగు అని అంటున్నారు. ఇప్పుడు కార్మికులకు బ్యాంకు, పోస్టల్ ఖాతాల ద్వారా వేతనాలు చెల్లిస్తున్నారు. ఎబిపిఎస్ని అనుసరించడం గజిబిజిగా ఉండే ప్రక్రియ అని ఆర్థికవేత్త డ్రెజ్ అన్నారు. కొత్త వ్యవస్థను ముందుకు తీసుకురావడం వెనుక హేతుబద్ధతను ఆయన ప్రశ్నించారు. ”సాధారణ బ్యాంకు ఖాతాలకు చేసిన చెల్లింపు కంటే ఎబిపిఎస్ ద్వారా చెల్లింపు మెరుగ్గా ఉంటుందని ఎటువంటి ఆధారాలు లేవు. ఇది మెజారిటీ కార్మికులకు పని లేకుండా చేసే నిర్లక్ష్య నిర్ణయం” అని ఆయన అన్నారు. ”ఎబిపిఎస్తో చాలా సంక్లిష్టత ఉంది. అందుకే చాలా మంది కార్మికులు ఇంకా చేయలేదు”అని డ్రెజ్ తెలిపారు. ఆన్లైన్ హాజరు తప్పనిసరి అనే కొత్త విధానంతో ఉపాధి హామీ కార్మికులు ఇప్పటికే ఎదుర్కొంటున్న సమస్యలను కార్యకర్త నిఖిల్ డే ఎత్తి చూపారు. ”పని ప్రదేశంలో కార్మికుడి ఫోటో తీయాలి. మొబైల్ యాప్లో అప్లోడ్ చేయాలి. ఈ ప్రక్రియ అస్తవ్యస్తమైన ఇంటర్నెట్ కనెక్టివిటీ కారణంగా నిలిచిపోయింది” అని అన్నారు.
ఉపాధి హామీనిర్వీర్యం : బి.వెంకట్
ప్రభుత్వం ఎన్ఆర్ఈజీఏ చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నదని ఏఐఏడబ్ల్యూయూ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ విమర్శించారు. అందులో భాగంగా బడ్జెట్ కేటాయింపుల కోత, ఆన్లైన్ హాజరు తప్పనిసరి వంటి చర్యలకు పాల్పడుతున్నదని తెలిపారు. ఇప్పుడు ఏకంగా కార్మికులను పనికి దూరం చేసేందుకు ఆధార్ ఆధారిత చెల్లింపులను తప్పనిసరి చేసిందన్నారు. ఉపాధి హామీ కోసం 2023-24 బడ్జెట్లో ప్రభుత్వం రూ.60,000 కోట్లు కేటాయించిందనీ, ఇది 2022-23లో సవరించిన కేటాయింపుల కంటే రూ.30,000 కోట్లు తక్కువగా ఉందని తెలిపారు.