కొండగట్టులో ఘోర రోడ్డు ప్రమాదం

– ఆర్టీసీ బస్సు.. లారీ ఢీ
– బస్‌ కండక్టర్‌ మృతి.. 8మందికి తీవ్ర గాయాలు
నవతెలంగాణ- జగిత్యాల టౌన్‌
కొండగట్టు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం తెల్లవారుజామున జగిత్యాల జిల్లా మల్యాల మండలం బస్వంతాపూర్‌ క్రాస్‌ రోడ్డుపై ఆర్టీసీ బస్సు, లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బస్‌ కండక్టర్‌ అక్కడికక్కడే ప్రాణం కోల్పోయారు. ఎనిమిది మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఎస్‌ఐ చిరంజీవి తెలిపిన వివరాల ప్రకారం.. తెల్లవారు జామున జగిత్యాల డిపో ఆర్టీసీ బస్సు వరంగల్‌కు బయలుదేరింది. కరీంనగర్‌ నుంచి జగిత్యాల వైపు కలప లోడ్‌తో వెళ్తున్న లారీ మల్యాల మండలంలోని బస్వంతాపూర్‌ క్రాస్‌ రోడ్ వద్ద ఆర్టీసీ బస్సును ఢీకొని బోల్తాపడింది. ఈ ఘటనలో కొడిమ్యాల మండలం శ్రీరాములపల్లికి చెందిన బస్‌ కండక్టర్‌ బొల్లం సత్తయ్య(55) అక్కడికక్కడే మృతిచెందారు. బస్సులో ఉన్న ఎనిమిది మందికి తీవ్రగాయాలు కావడంతో స్థానికులు 108లో జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండగా.. కరీంనగర్‌లోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సీఐ రమణమూర్తి ఘటనా స్థలంలో పరిశీలించారు. రోడ్డుకు అడ్డుగా పడిన వాహనాలను జేసీబీ సహాయంతో తొలగించారు. మృతుని కొడుకు బొల్లం ప్రవీణ్‌ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
బాధితులను పరామర్శించిన ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి
జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రమాద బాధితులను ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. అనంతరం కండక్టర్‌ కుటుంబ సభ్యులను పరామర్శించారు.

Spread the love