కోవిడ్‌ తర్వాత పెరిగిన తుంటి సమస్యలు

– ఆర్థో సింపోజియంలో డాక్టర్లు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
కోవిడ్‌ తర్వాత దేశవ్యాప్తంగా తుంటి సంబంధిత కేసులు పెద్ద ఎత్తున పెరిగాయని పలువురు ప్రముఖ ఆర్థో పెడిక్‌ సర్జన్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఆ సమయంలో చాలా మంది కరోనా పాజిటివ్‌ బాధితులు మోతాదుకు మించి స్టెరాయిడ్స్‌ కలిసిన టాబ్లెట్లు వాడారనీ, ఫలితంగా అవి ప్రస్తుతం చాలా మందిలో తుంటిలో రక్త ప్రసరణ సమస్యలను పెంచాయని హిప్‌ మాస్టర్‌ సైన్టిపిక్‌ వర్క్‌షాప్‌ అభిప్రాయ పడింది. టోటల్‌ హిప్‌ బేసిక్‌ టు అడ్వాన్స్డ్‌, తుంటి ఫెయిల్యూర్‌ పై హిప్‌ రివిజన్‌ అనే అంశాలపై ఆర్థో పెడిక్‌ సర్జన్ల జాతీయ స్థాయి సింపోజీయం నగరంలోని హైటెక్స్‌లో శనివారం ప్రారంభమయింది. రెండ్రోజుల పాటు అది కొనసాగనున్నది. ఈ సందర్భంగా సింపోసిజియం చైర్మెన్‌, ఆర్థో సర్జన్‌ డాక్టర్‌ ఉదరు కృష్ణ మైనేని మాట్లాడుతూ కోవిడ్‌ తర్వాత ఏ వాస్క్యులర్‌ నెక్రొసీస్‌ – (ఏ వీ ఎన్‌- తుంటిలో రక్త ప్రసరణ తగ్గిపోవడం లేదా కొన్ని చోట్ల ఆగిపోవడం వంటి కేసులు విపరీతంగా పెరిగాయని తెలిపారు. మద్యపానం, స్మోకింగ్‌ సేవించే అలవాటు ఉన్న వారిలో తుంటి సంబందిత సమస్యలు మరింత అధికమయ్యాయని చెప్పారు. ఆయా సమస్యల నుంచి రోగులను గట్టేక్కించేందుకు పీఆర్‌పీ ( ప్లేట్‌ లెట్‌ రీచ్‌ ప్లేజ్మా ), స్టెమ్‌ సెల్‌ థెరపీ, భీమాస్‌ ( బోన్‌ మ్యారో యాస్పరెట్‌ స్టెమ్‌ సెల్‌ థెరపీ కాంసెంట్రెషన్‌) వంటి అదునాతన చికిత్స విధానాలపై దేశవ్యాప్తంగా వచ్చిన 300 మంది ఆర్థో పెడిక్‌ సర్జన్లకు అవగాహన కల్పించినట్టు తెలిపారు.

Spread the love