ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇవ్వండి

– గృహనిర్మాణ శాఖ మంత్రికి తెలంగాణ
ప్రజా సంఘాల పోరాట వేదిక వినతి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్రంలోని పేదలకు ఇండ్లు, ఇండ్లస్థలాలు, డబుల్‌ బెడ్‌రూంలు ఇవ్వాలని తెలంగాణ ప్రజాసంఘాల పోరాట వేదిక రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు వేదిక ప్రతినిధులు రాష్ట్ర కమిటీ తరఫున శనివారం మంత్రికి వినతిపత్రం సమర్పించారు. మంత్రిని కలిసిన వారిలో శాసనమండలి సభ్యులు అలుగుబెల్లి నర్సిరెడ్డి, తెలంగాణ ప్రజా సంఘాల పోరాట వేదిక రాష్ట్ర కన్వీనర్‌ ఎస్‌ వీరయ్య, పట్నం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డీజీ నరసింహారావు, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి సాగర్‌ ఉన్నారు. ఇండ్ల స్థలాల కోసం 22 జిల్లాల్లో గుడిసెలు వేసుకొని పేదలు గత 6 నెలలుగా శాంతియుతంగా ఆందోళనలు నిర్వహిస్తున్నారని గుర్తుచేశారు. గుడిసెలు వేసుకున్న పేదలకు పట్టాలివ్వాలనీ, ఇండ్ల నిర్మాణం చేపట్టాలనీ, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్ల కోసం ధరఖాస్తులు చేసుకున్న వారికి వాటిని ఇవ్వాలనీ కోరారు. సొంత స్థలాలు ఉన్నవారికి ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షలు ఇవ్వాలనీ, స్థలమే లేని పేదలకు 120 గజాల స్థలం కేటాయించి రూ. 5 లక్షలు ఇంటి నిర్మాణం కోసం ఇవ్వాలని కోరారు. ఈ డిమాండ్ల సాధనకోసం శుక్రవారం (ఫిబ్రవరి 3) అన్ని మున్సిపల్‌ పట్టణాల్లో ధర్నాలు జరిగాయనీ, ఈనెల 9న హైదరాబాద్‌లో మహాధర్నా నిర్వహిస్తున్నామని వివరించారు. తక్షణం సమస్యలను పరిష్కరించాలని కోరారు.

Spread the love