ఘోర ప్రమాదం

–  రెండు రైళ్లు ఢీకొని 32 మంది సజీవదహనం
–  గ్రీస్‌లో ఘటన
తెంపీ : ఎదురెదురుగా వచ్చిన రెండు రైళ్లు ఢకొీని 32 మంది సజీవదహనమైన ఘోర ఘటన మంగళవారం అర్ధరాత్రి గ్రీస్‌లో జరిగింది. ఈ ప్రమాదంలో మరో 85 మందికి పైగా గాయపడ్డారు. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. ఏథెన్స్‌ నుంచి థెసాలోనికి వెళుతున్న ఓ ప్రయాణికుల రైలు.. తెంపీ సమీపంలో ఎదురుగా వస్తున్న కార్గో రైలును బలంగా ఢీకొట్టింది. దీంతో ప్రయాణికుల రైలుకు చెందిన తొలి మూడు బోగీల్లో భారీగా మంటలు చెలరేగాయి. మరిన్ని బోగీలు పట్టాలు తప్పి పక్కకు పడిపోయాయి. ఈ ప్రమాద తీవ్రతకు ధ్వంసమైన ముందు బోగీల్లో 32 మంది సజీవదహనంకాగా, మరి కొంతమందిని సిబ్బంది కాపాడి ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. సమాచారమందుకున్న భద్రతా సిబ్బంది, పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. ప్రమాద సమయంలో ప్యాసింజర్‌ రైలులో దాదాపు 350 మంది ప్రయాణికులున్నారు. వీరిలో 200 మందిని సహాయక సిబ్బంది సురక్షితంగా కాపాడారు. చీకటిగా ఉండటం, మంటలు పెద్దఎత్తున చెలరేగడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్టు తెలుస్తోంది.

Spread the love