టిప్పు సుల్తాన్‌ ఫాలోవర్స్‌ బతికుండటానికి వీల్లేదు..

–  కర్నాటక బీజేపీ చీఫ్‌ నళిన్‌ కుమార్‌ కాతీల్‌ విద్వేష ప్రసంగం
– వారిని వెంటాడి…అడవులకు తరిమేయాలని పిలుపు
న్యూఢిల్లీ : కర్నాటకలో విద్వేష ప్రసంగాలకు బీజేపీ నాయకులు ఆజ్యం పోస్తున్నారు. ఒక వర్గం వారిని లక్ష్యంగా చేసుకొని హిందువుల్ని రెచ్చగొట్టడమే పనిగా పెట్టుకున్నారు. టిప్పు సుల్తాన్‌ ఫాలోవర్స్‌ను వెంటాడి.. వెంటాడి చంపాలని కర్నాటక రాష్ట్ర చీఫ్‌ నళిన్‌ కుమార్‌ కాతీల్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొప్పాల్‌ జిల్లాలో యెల్‌బుర్గాలో బుధవారం జరిగిన ఒక సభలో కాతీల్‌ మాట్లాడుతూ, ”మనమంతా శ్రీరాముడి భక్తులం. టిప్పు సుల్తాన్‌కు కాదు. మీరంతా టిప్పు సుల్తాన్‌ను ఆరాధిస్తారా? శ్రీరాముడ్ని ఆరాధిస్తారా? చెప్పండి. ఈ రాష్ట్రానికి కావాల్సింది హనుమంతుడి భక్తులు. టిప్పు సుల్తాన్‌ ఫాలోవర్స్‌ కాదు. టిప్పు సుల్తాన్‌ భకులు, ఫాలోవర్స్‌ బతికుండటానికి వీల్లేదు. వెంటాడి చంపేయండి” అంటూ తీవ్రమైన విద్వేష వ్యాఖ్యలు చేశారు. టిప్పు సుల్తాన్‌ ఎంతోమంది హిందువుల్ని బలవంతంగా మత మార్పిడికి గురిచేశాడని, కర్నాటకలో హిందూత్వ గ్రూపులు మెజార్టీ ప్రజల్ని ప్రభావితం చేస్తున్నాయి. టిప్పు సుల్తాన్‌ జయంతి అంశాన్ని రాజకీయ ఆయుధంగా మార్చుకుంది. జయంతి ఉత్సవాలు నిర్వహించటాన్ని అధికార బీజేపీ వ్యతిరేకిస్తోంది. మరోవైపు కాంగ్రెస్‌ టిప్పు సుల్తాన్‌ను తొలితరం స్వతంత్ర పోరాటయోధుడిగా పేర్కొంటోంది. సిద్ధరామయ్య ప్రభుత్వం ఆయన జయంతి ఉత్సవాల్ని నిర్వహించింది. టిప్పు సుల్తాన్‌ అంశానికి బీజేపీ మతంరంగు పులుముతోంది. మెజార్టీ హిందువుల్ని భావోద్వేగానికి గురిచేస్తోంది. కాతీల్‌ గతంలోనూ విద్వేష ప్రసంగాలు చేశారు. మతపరంగా హిందువుల్ని రెచ్చగొడుతూ ప్రసంగించటం ఆయనకు పరిపాటిగా మారింది త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్ని టిప్పు వర్సెస్‌ సావార్కర్‌గా పేర్కొన్నాడు. ఈ ఏడాది ఏప్రిల్‌-మేలో కర్నాటక అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి.

Spread the love