తెలుగు కథానిక స్రష్ట రెండు తెలుగు రాష్ట్రాల్లో సుప్రసిద్ధ కథకునిగా ఖ్యాతినొందిన భమిడిపాటి జగన్నాథరావు (89) ఫిబ్రవరి 6న హైదరాబాద్లో కన్ను మూసారు. 1934 డిసెంబర్ 1న కృష్ణాజిల్లా గుడివాడలో పుట్టిన ఆయన నాగపూర్ యూనివర్శిటీ నుంచి ఎం.ఏ. పబ్లిక్ ఎడ్మినిస్ట్రేషన్ పట్టా పొందారు. ఆంధ్రప్రదేశ్ సమాచార శాఖలో జాయింట్ డైరెక్టర్గా పని చేసారు. 1950 – 60 మధ్య వీరి కథలు పాఠకుల్ని ఉర్రూతలూగించాయి. అడుగుజాడలు, మువ్వలు, పరస్పరం, చూపు, చిత్రనళీయం, అపరంజి పంజరం. అనుతాపం, అనురాగం, చేదునిజం, జాజిపూలు, జీవనరాగం, సముద్రం, లౌక్యుడు, రంగుల కల, వంతెన, వెన్నెల జల్లు, మంటల్లో జాబిల్లి, బొంగరం, బంతి, భావి పౌరులు, పాపం దీక్షితులు, దాహం, జీవితపు విలువలు లాంటి కథలు రాసారు. మానవసంబంధాలు సమాజంలో నీతి, విలువలు ప్రబోధించే ఆయన 3 కథా సంపుటాలను వెలువరించారు. ‘భమిడిపాటి జగన్నాథరావు కథలు’ యువ కథకులకు స్ఫూర్తినిస్తాయి. తనదైన కథా సాహిత్య ముద్రవేసిన భమిడిపాటికి నివాళులు.