మీ పేర్లు చేర్చం..

–  కేంద్రానికి సుప్రీం షాక్‌
– హిండెన్‌బర్గ్‌-అదానీ వివాదంలో సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు
– కమిటీలో కేంద్రం సూచించిన నిపుణుల పేర్లను చేర్చేందుకు నిరాకరణ
– మేమే నిపుణులను ఎంపిక చేస్తాం
– మొత్తం ప్రక్రియను పూర్తి పారదర్శకంగా నిర్వహిస్తాం
– కమిటీ పట్ల ప్రజలకు
సంపూర్ణ విశ్వాసం ఉండాలి : న్యాయస్థానం స్పష్టీకరణ
న్యూఢిల్లీ : అదానీ గ్రూప్‌ – హిండెన్‌బర్గ్‌ నివేదిక వివాదాన్ని పరిశీలించేందుకు ఏర్పాటుచేసే కమిటీ విషయంలో కేంద్రానికి సుప్రీంకోర్టు షాకిచ్చింది. కేంద్ర ప్రభుత్వం సీల్డ్‌ కవర్లో సూచించే నిపుణుల పేర్లను చేర్చేందుకు అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం నిరాకరించింది. న్యాయవాదులు మనోహర్‌ లాల్‌ శర్మ, విశాల్‌ తివారీ, కాంగ్రెస్‌ నేత జయా ఠాకూర్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేెఐ) జస్టిస్‌ డివై చంద్రచూడ్‌, జస్టిస్‌ పిఎస్‌ నరసింహ, జస్టిస్‌ జెబి పార్దివాలా నేతృత్వంలోని ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది. తామే స్వయంగా నిపుణులను ఎంపిక చేస్తామనీ, మొత్తం ప్రక్రియను పూర్తి పారదర్శకంగా నిర్వహిస్తామని ధర్మాసనం తెలిపింది. నిపుణుల పేర్లను తాము ప్రభుత్వం నుంచి స్వీకరిస్తే, అది ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ అవుతుందని సుప్రీంకోర్టు తెలిపింది. కమిటీ పట్ల ప్రజలకు సంపూర్ణ విశ్వాసం ఉండాలని పేర్కొంది. హిండెన్‌బర్గ్‌-అదానీ వివాదంపై దర్యాప్తు జరిపేందుకు సిట్టింగ్‌ సుప్రీంకోర్టు న్యాయమూర్తిని నియమించబోమని స్పష్టం చేసింది. అయితే రిటైర్డ్‌ సుప్రీంకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేస్తామని వివరించింది. అయితే కేంద్ర ప్రభుత్వం అంతకుముందు వినిపించిన వాదనల్లో, మన దేశంలోని సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా (సెబి) వంటి చట్టబద్ధ వ్యవస్థలకు సంపూర్ణ సమర్థత ఉందనీ, ఇవి తమ పని తాము చేస్తున్నాయని తెలిపింది. ఇటువంటి పరిస్థితుల్లో మన దేశంలోని నియంత్రణ వ్యవస్థలకు ఓ పర్యవేక్షక కమిటీ ఉండాలనే ఉద్దేశపూర్వకం కానటువంటి సందేశం పెట్టుబడిదారులకు వెళ్లడం వల్ల విదేశీ నిధుల రాకపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. నిపుణుల కమిటీకి సంబంధించిన అన్ని వివరాలను, అంటే, నిపుణుల పేర్లు, కమిటీ పరిధి వంటి వివరాలన్నిటినీ సీల్డ్‌ కవర్లో అందజేస్తామని అత్యున్నత న్యాయస్థానానికి తెలిపింది. సెబి దాఖలు చేసిన అఫిడవిట్‌లో, షార్ట్‌ సెల్లింగ్‌ను లేదా బారోవ్డ్‌ షేర్స్‌ అమ్మకాన్ని నిషేధించడానికి తాము అనుకూలం కాదని పేర్కొంది. అదానీ గ్రూప్‌పై ఓ చిన్న షార్ట్‌ సెల్లర్‌ చేసిన ఆరోపణలపైనా, దాని షేర్ల ధరల కదలికలపైనా దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపింది.సుప్రీంకోర్టు ఫిబ్రవరి 10న నిర్వహించిన విచారణ సందర్భంగా, అదానీ గ్రూప్‌ స్టాక్‌ పతనం నేపథ్యంలో మార్కెట్‌ ఒడిదుడుకుల నుంచి భారతీయ పెట్టుబడిదారుల ప్రయోజనాలను కాపాడవలసిన అవసరం ఉందని తెలిపింది. దేశంలోని నియంత్రణ వ్యవస్థలను పటిష్ట పరచడానికి తీసుకోవలసిన చర్యలను సిఫారసు చేసేందుకు రిటైర్డ్‌ జడ్జి నేతృత్వంలో ఓ డొమైన్‌ ఎక్స్‌పర్ట్స్‌ కమిటీని ఏర్పాటు చేయడంపై పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వానికి తెలిపింది. హిండెన్‌బర్గ్‌ నివేదిక జనవరి 24న విడుదలైంది. ఆ తర్వాత అదానీ గ్రూప్‌ కంపెనీల షేర్లు భారీగా పతనమైన సంగతి తెలిసిందే. గౌతమ్‌ అదానీ నేతృత్వంలోని ఈ కంపెనీలు ఇప్పటి వరకు 120 బిలియన్‌ డాలర్ల మార్కెట్‌ విలువను కోల్పోయాయి.
       నిపుణుల పేర్లను మేం ప్రభుత్వం నుంచి స్వీకరిస్తే, అది ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ అవుతుంది. కమిటీ పట్ల ప్రజలకు సంపూర్ణ విశ్వాసం ఉండాలి. హిండెన్‌బర్గ్‌-అదానీ వివాదంపై దర్యాప్తు జరిపేందుకు సిట్టింగ్‌ సుప్రీంకోర్టు న్యాయమూర్తిని నియమించం. రిటైర్డ్‌ సుప్రీంకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేస్తాం.
సుప్రీంకోర్టు

Spread the love