విలేకరిపై దాడిని ఖండించిన తమ్మినేని

– వినతిపత్రం అందజేసిన జర్నలిస్టు సంఘాల నాయకులు
నవతెలంగాణ-నేరేడుచర్ల
నీతి, నిజాయితీ నిస్వార్థంతో పనిచేస్తున్న విలేకరులపై కొంతమంది రాజకీయ నాయకులు కక్షగట్టి దాడులు చేస్తున్నారని టీడబ్య్లూజేఎఫ్‌, టీడబ్ల్యూజే (ఐజేయూ), టీడబ్ల్యూజేహెచ్‌ 143 జర్నలిస్ట్‌ సంఘాల నాయకులు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం దృష్టికి తీసుకెళ్లారు. శనివారం నేరేడుచర్ల పట్టణంలోని అరిబండి భవన్‌లో ఆయనకు వినతిపత్రం అందజేశారు. ఇటీవల యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు పట్టణంలో కౌన్సిలర్లకు, చైర్మెన్‌కు మధ్య అసమ్మతి గురించి వార్త రాసినందుకుగాను చైర్మెన్‌కు సంబంధించిన వ్యక్తులు ఆ జర్నలిస్ట్‌ ఇంటికి వెళ్లి దాడి చేయడాన్ని ఆయనకు వివరించారు. దీనికి సంబంధించిన వివరాలు పూర్తిగా తెలుసుకొని ప్రభుత్వం, అధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి చర్చిస్తానని, అదేవిధంగా దాడిని తీవ్రంగా ఖండించారు. అలాగే జర్నలిస్టుల సమస్యలపైనా సీఎంకు చెప్పి పరిష్కారమయ్యేలా చూడాలని విలేకరులు కోరారు. వినతిపత్రాలు అందజేసిన వారిలో టీడబ్ల్యూజేఎఫ్‌ రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులు సట్టు శ్రీనివాస్‌, హుజూర్‌నగర్‌ డివిజన్‌ అధ్యక్షులు రావుల రాజు, కార్యదర్శి ఆర్లపూడి వీరభద్రం, టీడబ్య్లూజేహెచ్‌-143 డివిజన్‌ ప్రధాన కార్యదర్శి మానుకొండ రాంరెడ్డి, టీడబ్య్లూజే (ఐజేయూ)జిల్లా ఉపాధ్యక్షులు టీఎన్‌.స్వామి, విలేకరులు బాలకృష్ణ, శంకర్‌, యుగంధర్‌, వీరయ్య, రవీందర్‌ పాల్గొన్నారు.

Spread the love