గడువులోపు పూర్తి చేస్తాం: తహశీల్దార్ రవికుమార్
నవతెలంగాణ – మల్హర్ రావు
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) సర్వే ఫారాల పంపిణీ ప్రక్రియ మండలంలో వేగవంతంగా సాగుతోంది. మండల తహశీల్దార్ రవికుమార్ ఆధ్వర్యంలో బీఎల్వోలు పోలింగ్ కేంద్రాల్లో ఇంటింటా తిరిగి ఫారాలు అందజేస్తున్నారు. మండలంలోని 15 గ్రామాల్లో మొత్తం 24 పోలింగ్ కేంద్రాలున్నాయి. వీటి పరిధిలో ఈ నెల 25 నుంచి ఎన్యూమరేషన్ పత్రాల పంపిణీని ప్రారంభించిన విషయం తెలిసిందే. వారం రోజుల్లో మండలంలో 79 శాతం మంది ఓటర్లకు సర్ పత్రాలు అందజేశారు. రాజకీయ పార్టీల బూత్ స్థాయి ఏజెంట్లకు ఆయా పార్టీల నేతలు సూచించడంతో బీఎల్ వోల వెంట నాయకులు ఉంటూ.. పత్రాల పంపిణీలో పాల్గొంటున్నారు.
ఓటర్లకు చేరిన పత్రాలను పూర్తి వివరాలతో తిరిగి బీఎల్ వోలకు జులై 24 వరకు అందజేయాల్సి ఉంటుంది. ఓటరు ప్రస్తుత పోలింగ్ కేంద్రం సంఖ్య, జాబితాలో క్రమ సంఖ్య ఎన్యూమరేషన్ పత్రాలపై ముద్రించి ఉంది. 2002 జాబితా లోని వివరాల కోసం బీఎల్ వోలను సంప్రదించాలి. ఎన్నికల సంఘం వెబ్సైట్ నుంచి ఆ వివరాలను తెలుసుకునే వెసులు బాటు సైతం కల్పించారు. గ్రామాల వారీగా ఇంటి నంబరు ఆధారంగా మన ఓటు వివరాలు 2002 నాటి జాబితాలో గుర్తించేందుకు వీలుంది. మండలంలో మొత్తం 22,524 మంది ఓటర్లకు గాను బుధవారం వరకు 17,942 మందికి పంపిణీ పూర్తయింది. ఇందులో 83 పత్రాలు డిజిటలైజేషన్ చేశారు. పంపిణీ పైనే బీఎల్ వోలు ప్రత్యేక దృష్టి సారించినా డిజిటలైజేషన్ కొంతమేరకు నెమ్మదిగా సాగుతోంది. అత్యధి కంగా మల్లంపల్లి గ్రామంలో.. అత్యల్పంగా తాడిచెర్లలో జరుగుతోంది.
గడువులోగా పూర్తి: తహసీల్దార్ రవికుమార్
గతంలో ఒక కుటుంబంలోని ఓట్లు రెండు, మూడు పోలింగ్ కేంద్రాల్లో ఉండేవి. అలాంటివి గుర్తించి కుటుంబంలోని మొత్తం ఓట్లు ఒకే పీఎస్ లో ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. సర్ నమోదు ప్రక్రియ నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని బీఎల్ వోలను ఆదేశిస్తున్నాం.



