గురుకుల పరీక్షకు 86.54శాతం అభ్యర్థులు హాజరు

– సజావుగా సాగిన పరీక్ష
– ట్రిబ్‌ కన్వీనర్‌ డాక్టర్‌ మల్లయ్య బట్టు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
తెలంగాణ గురుకుల పాఠశాలల్లో ఉద్యోగ నియామకాల కోసం నిర్వహిస్తున్న పరీక్షల్లో మొదటి రోజు 86.54 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారని తెలంగాణ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇనిస్టిట్యూట్స్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు(ట్రిబ్‌ )కన్వీనర్‌ డాక్టర్‌ మల్లయ్య బట్టు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మొదటి సారిగా ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్న ఈ పరీక్షల్లో 10,920 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా 9,450 మంది అభ్యర్థులు హాజరు అయ్యారని తెలిపారు. మూడు షిఫ్ట్‌ల్లో హాజరైన అభ్యర్థులు.. ఫస్ట్‌ సెషన్‌లో 5,032 మంది హాజరు కావాల్సి ఉండగా 4,368 మంది, రెండో సెషన్‌లో 5,454 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా 4,720 మంది, మూడో సెషన్‌లో 434 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా 362 మంది హాజరయ్యారని తెలిపారు. అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు అరగంట ముందుగా చేరుకోవాలని ఆయన సూచించారు. అభ్యర్థులు తమ పరీక్ష తేదీలను తెలుసుకుని వారం రోజుల ముందుగా హాల్‌ టికెట్లను డౌన్‌ లోడ్‌ చేసుకోవాలని మల్లయ్య బట్టు సూచించారు.

Spread the love