ప్రతి విద్యార్థి స్కూల్లోనే ఉండాలి : కలెక్టర్లకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
బెస్ట్ అవైలబుల్ స్కూళ్లపై వెంటనే నివేదిక పంపాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. బకాయిల పేరిట బెస్ట్ అవైలబుల్ స్కూళ్ల కు విద్యార్థులను అనుమతించక పోవడంపై సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్తో కలిసి మంగళవారం హైదరాబాద్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ”బెస్ట్ అవైలబుల్ స్కీం నిధులకు సంబంధించిన ఒప్పందం పాఠశాల యాజమాన్యాలు, జిల్లా యంత్రాంగం మధ్య జరిగింది. ఏవైనా సమస్యలు ఉత్పన్నమైతే పాఠశాల యాజమాన్యాలు జిల్లా యంత్రాంగాన్ని సంప్రదించాలే తప్ప విద్యార్థులను బయటికి పంపడానికి వీలులేదు. జిల్లా కలెక్టర్లు, డీఈవోలు, సంక్షేమ శాఖ అధికారులు ఈ అంశాన్ని సీరియస్గా తీసుకొని ఈ స్కీం కింద ఎంపికైన ప్రతి విద్యార్థి పాఠశాలలో ఉండేలా వెంటనే చర్యలు చేపట్టండి” అని భట్టి ఆదేశించారు.
విద్యా హక్కు చట్టం, బెస్ట్ అవైలబుల్ స్కీం ఏం చెబుతుందో పాఠశాలల యాజమాన్యాలను పిలిచి వివరించాలని కలెక్టర్లకు సూచించారు. ఈ స్కీం కింద పాఠశాలల వారీగా ఉన్న బకాయిల వివరాలను వెంటనే పంపాలని ఆదేశించారు. బకాయిల్లో కొంత మొత్తాన్ని వెంటనే విడుదల చేస్తామని అన్నారు. ”బెస్ట్ అవైలబుల్ స్కీమ్ నిధులు ఎప్పటికప్పుడు రాకపోతే కొన్ని పాఠశాలలు మూసివేసే పరిస్థితి ఉందని యాజమాన్యాలు అంటున్నాయి. ఈ స్కీం నిధులపై ఆధారపడితే అది ప్రముఖ పాఠశాల ఏ విధంగా అవుతుంది. డీఈవోలు వెంటనే అన్ని బెస్ట్ అవైలబుల్ స్కూళ్లను సందర్శించాలి. ఆయా పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఎంత? ప్రభుత్వ నిబంధనలు పాటిస్తున్నారా? లేదా? వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి? తదితర వివరాలతో వెంటనే నివేదిక సమర్పించండి” అని భట్టి ఆదేశించారు. ఈ సమావేశంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగితా రానా, సాంఘీక సంక్షేమ శాఖ కార్యదర్శి బుద్ధ ప్రకాశ్, కమిషనర్ క్షితిజ తదితరులు పాల్గొన్నారు.
బెస్ట్ అవైలబుల్ స్కూళ్లపై వెంటనే నివేదిక పంపండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES