సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులపై చర్యలు తీసుకోండి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కొత్తగా డీజీపీ బాధ్యతలు చేపట్టిన శివధర్రెడ్డిని రైతు కమిషన్ బృందం మర్యాదపూర్వకంగా కలిసింది. ఈమేరకు బుధవారం హైదరాబాద్లోని డీజీపీ కార్యాలయంలో ఆయనకు శాలువా కప్పి, పూలబొకే అందజేశారు. సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్లో వస్తున్న అసభ్యకరమైన పోస్టులపై ఈ సందర్భంగా డీజీపీతో రైతు కమిషన్ చైర్మెన్ కోదండరెడ్డి, సభ్యులు రాములునాయక్, భవానీరెడ్డి సుదీర్ఘంగా చర్చించారు. వ్యక్తులను టార్గెట్ చేసి అసభ్యకరమైన పోస్ట్లు, టైటిల్స్, థంబ్ నెల్స్ పెడుతున్నారని తెలిపారు.
దానివల్ల ఆ వ్యక్తి కుటుంబ సభ్యులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని తెలిపారు. అత్యున్నత హోదాలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై కూడా ఇలాంటి పోస్ట్లు పెట్టినట్టు ఉదాహరించారు. పైగా వాటిని యూట్యూబ్లో అప్లోడ్ చేయడం మంచి పద్దతి కాదని తెలిపారు. ఏ వ్యక్తిపై కూడా అసభ్యకరమైన పోస్టులను చేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరారు.