సీపీఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు..
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్మిక వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల విధానాలను అవలంబిస్తున్న మోడీ ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని, విద్యుత్ సవరణ చట్టం- 2025, వీబీజి-రామ్ జీ చట్టం, విత్తన సవరణ బిల్లు, ఎల్బీసీలో 100 శాతం విదేశీ పెట్టుబుడలకు అనుమతించడం లాంటి ప్రజావ్యతిరేక విధానాలను ఉపసంహరించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలో ధర్మ బిక్షం భవనంలో జరిగిన ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ కేంద్ర కార్మిక సంఘాలు ఈ నెల 12న జరుప తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు సిపిఐ పార్టీ సంపూర్ణ మద్దత్తును తెలియజేస్తున్నామని అన్నారు.
జిల్లాలో కార్మికులు, ప్రజా సంఘాలు ఈ సమ్మెలో పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్మికులు పోరాడి సాధించుకున్న 29 చట్టాలను రద్దు చేసి, యాజమాన్యాలకు లాభం చేకూర్చేలా ప్రమాదకరమైన 4 లేబర్ కోడ్లను తెచ్చింది. వీటి వల్ల కార్మికులు ఈఎస్ఐ, పిఎఫ్, గ్రాట్యుటీ మరియు పెన్షన్ వంటి సామాజిక భద్రతకు దూరమవుతారు. ఉద్యోగ భద్రత వుండదు. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో కార్మికుల పనిగంటలు పెంచుతూ చట్ట సవరణ జరిగింది. వీబీజి-రామ్ జీ చట్టం తెచ్చి కేంద్రం తన బాధ్యతల నుండి తప్పుకుంటున్నది. బడ్జెట్లో కేటాయింపులు తగ్గింపు, పని రోజులు తగిస్తోంది. విద్యుత్ సవరణ బిల్లువల్ల సామాన్యులకు విద్యుత్ చార్జీలు పెరుగుతాయి.
స్మార్ట్ మీటర్లు, క్రాస్ సబ్సిడీ రద్దుతో రైతులు, పేదలకిచ్చే ఉచిత మరియు సబ్సిడీ విద్యుత్ ప్రమాదంలో పడుతుందన్నారు. ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పటానికి దేశవ్యాప్త సమ్మెకు దేశ ప్రజలంతా సంఘీభావం తెలిపి సమ్మెను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రజా వ్యతిరేక విధానాలు రద్దు చేసే అంతవరకు ప్రజా ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు. ఈ సమావేశంలో సిపిఐ పట్టణ కార్యదర్శి బూర వెంకటేశ్వర్లు, చామల అశోక్ కుమార్ మాజీ కౌన్సిలర్ అనంతుల మల్లేశ్వరి, బూర సైదులు, ఎడెల్లి శ్రీకాంత్, దేశగాని హేమలత తదితరులు పాల్గొన్నారు.



