కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాల డిమాండ్
నల్ల బ్యాడ్జీలతో కార్మిక శాఖ కార్యాలయం ముందు నిరసన
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రాష్ట్రంలో అమలు చేయొద్దంటూ కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు గురువారం హైదరాబాద్లోని కార్మిక శాఖ కమిషనరేట్ ముందు నల్ల బ్యాడ్జీలతో నిరసన చేపట్టాయి.‘ కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను రద్దు చేయాలి, బీజేపీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు నశించాలి, కార్మిక హక్కులను హరిస్తే..ఖబడ్దార్..ఖబడ్దార్, కార్మికుల ఐక్యత వర్థిల్లాలి’ అంటూ కార్మికులు నినదించారు. రాష్ట్ర ప్రభుత్వం కోడ్ లపై చేపట్టిన నిబంధనల సంప్రదింపుల సమావే శానికి ముందు ఈ నిరసన కార్య క్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీయూ నగర కార్యదర్శి కుమారస్వామి అధ్యక్షతన జరిగిన సభలో ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ రాష్ట్రంలో లేబర్ కోడ్ లను అమలు చేస్తే కార్మిక వర్గం సహించబోదని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ ఈ కోడ్లకు వ్యతిరేకంగా గతంలో మాట్లాడిన విషయాన్ని గుర్తు చేశారు. మాట తప్పొద్దని సూచించారు. బీజేపీ విధానాలకు కాంగ్రెస్ వంతపాడొద్దని హితవు పలికారు.
కార్మిక హక్కులను హరించే ఆ కోడ్ లను రద్దు చేసే వరకు పోరాటాలు కొనసాగుతాయని చెప్పారు. ఏఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.బాలరాజు మాట్లాడుతూ 300పేజీల రూల్స్ చదివేందుకు కనీస సమయం ఇవ్వకుండా సమావేశాలేంటి? అని ప్రశ్నించారు. ఈ విషయంలో కావాలనే ప్రభుత్వం వేగం పెంచిందని విమర్శించారు. గతంలో మంత్రి హామీ ఇచ్చారనీ, ఆ మాటమీద నిలబడాలని సూచించారు. కార్మికుల పట్ల ప్రభుత్వం మొండిగా వ్యవహరించొద్దని చెప్పారు. ఐఎన్టీయూసీ నేత విజయకుమార్ యాదవ్, టీయూసీఐ అధ్యక్షులు కె సూర్యం, ఐఎఫ్టీయూ ప్రధాన కార్యదర్శి ఎం శ్రీనివాస్, టీఆర్ఎస్కేవీ అధ్యక్షులు రాంబాబు యాదవ్, టీఎన్టీయూసీ అధ్యక్షులు బోస్ తదితరులు మాట్లాడారు. అనంతరం కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ గంగాధర్కి కార్మిక సంఘాలు వినతి పత్రాన్ని సమర్పించాయి. ఆ తర్వాత జేసీఎల్ శ్యాంసుందర్, చంద్రశేఖర్, అడిషనల్ సెక్రటరీ సురేంద్రమోహన్,ప్రమోదరెడ్డి తదితరుల సమక్షంలో సోషల్ సెక్యూరిటీ కోడ్పై ప్రజంటేషన్ ఇచ్చారు. అభ్యంతరాలను రాత పూర్వకంగా ఇవ్వాలని వారు కార్మిక సంఘాలకు సూచించారు.
కార్మికుల సాంఘిక భద్రత పట్ల ప్రభుత్వం తయారు చేసిన రూల్స్పై కార్మిక సంఘాలు పలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. లిఖిత పూర్వకంగా మరి కొన్ని అంశాలను అందిస్తామని నేతలు ప్రకటించారు. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు వీఎస్ రావు ఆ సంఘం తరుపున సూచించిన సవరణలకు అధికారులు సానుకూలంగా స్పంధించారు. తప్పకుండా సవరలకు పెడతామని హామీ ఇచ్చారు. మరింత సమగ్రంగా రాత పూర్వకంగా ఇస్తామని సీఐటీయూ నాయకత్వం ప్రకటించింది. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్వీ రమ,భూపాల్, కార్యదర్శులు జె వెంకటేశ్, పి శ్రీకాంత్, కె ఈశ్వర్రావు, కోశాధికారి వంగూరు రాములు, ఐఎన్టీయూ నాయకులు విజయ్ కుమార్, టీఎన్టీయూసీ నాయకులు బోస్, టీయూసీఐ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సూర్యం, ఎస్ఎల్ పద్మ, ఐఎఫ్టీయూ ప్రధాన కార్యదర్శి ఎం శ్రీనివాస్, అనురాధ, అరుణక్క, డీబీఎఫ్ అధ్యక్షులు శంకర్ తదితరులు పాల్గొన్నారు. లేబర్ కోడ్ లు రద్దు చేయకుండా రూల్స్ ప్రేమ్ చేయటాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ కేవీ అధ్యక్షులు రాంబాబు యాదవ్ సమావేశాన్ని బహిష్కరించారు.



