Saturday, February 14, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుపైచేయి సాధించినా..

పైచేయి సాధించినా..

- Advertisement -

ప్రతిపక్షాల నుంచి టఫ్‌ ఫైట్‌
33 మున్సిపాల్టీల్లో హంగ్‌
బలమైన స్థానాల్లో బీఆర్‌ఎస్‌ విజయం
అధికార పార్టీకి రాజకీయ ప్రత్యర్థి గులాబీ పార్టీనే!
బీజేపీ ప్రభావం అంతంతే..
సత్తా చాటిన వామపక్షాలు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు రసవత్తరంగా మారాయి. మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలతో రాజకీయ పార్టీల బలాబలాలు వెల్లడయ్యాయి. అధికార కాంగ్రెస్‌ పార్టీకి పట్టణ ఓటర్లు అండగా నిలిచారు. అత్యధిక మున్సిపాల్టీలు, మున్సిపల్‌ కార్పొరేషన్లను ఆ పార్టీ కైవసం చేసుకుంది. పంచాయతీ ఎన్నికల విజయం సాధించి ఊపుమీదున్న అధికార కాంగ్రెస్‌పార్టీకి మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల నుంచి గట్టి పోటీ ఎదురైంది. చాలాచోట్ల హోరాహోరీ పోరు తప్పలేదు. ఎక్కువ స్థానాలను గెలవడం అంత సులభం కూడా కాలేదు. 2020లో జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో అధికార పార్టీగా ఉన్న బీఆర్‌ఎస్‌కు వచ్చినట్టుగా ఇప్పుడు కాంగ్రెస్‌కు పూర్తిస్థాయిలో మెజార్టీ స్థానాలు రాకపోవడం గమనార్హం.

బీఆర్‌ఎస్‌ హయాంలో 130 మున్సిపాల్టీలకు ఎన్నికలు జరిగితే బీఆర్‌ఎస్‌కు 122 (94 శాతం), కాంగ్రెస్‌కు నాలుగు (3 శాతం), బీజేపీకి రెండు (1.5 శాతం), ఎంఐఎంకు రెండు (1.5 శాతం) మున్సిపాల్టీలు దక్కాయి. ఇప్పుడు 116 మున్సిపాల్టీల్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 68 (55.17 శాతం), బీఆర్‌ఎస్‌కు 13 (11.21 శాతం), బీజేపీ ఒకటి, ఫార్వర్డ్‌బ్లాక్‌ ఒకటి, ఎంఐఎం ఒకటి చొప్పున కైవసం చేసుకున్నాయి. 33 మున్సిపాల్టీల్లో హంగ్‌ ఏర్పడింది. ఏడు మున్సిపల్‌ కార్పొరేషన్లకు సంబంధించి రామగుండం, మహబూబ్‌నగర్‌, నల్లగొండ, మంచిర్యాలలో కాంగ్రెస్‌, కొత్తగూడెంలో బీఆర్‌ఎస్‌ మద్దతుతో సీపీఐ విజయం సాధించాయి. నిజామాబాద్‌, కరీంనగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్లలో హంగ్‌ ఏర్పడింది. అయితే కరీంనగర్‌లో బీజేపీ అధిక స్థానాలను సాధించింది. పట్టణ ప్రాంత ఓటర్లు ఏ రాజకీయ పార్టీకి ఏకపక్షంగా తీర్పునివ్వకపోవడం గమనార్హం.

బీజేపీ అంతంత మాత్రమే!
మున్సిపల్‌ ఎన్నికల్లో బీజేపీ ప్రభావం పరిమితంగానే ఉంది. 116 మున్సిపాల్టీల్లో పోటీచేసి, ఒక్క చోటే విజయం సాధించింది. నిజామాబాద్‌, కరీంనగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్లలో హంగ్‌ ఏర్పడింది. ఈ రెండుచోట్లా బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ విజేతలు కీలకంగా మారారు. మున్సిపల్‌ ఎన్నికల్లో కేంద్ర మంత్రులు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ తెలంగాణకు వచ్చి ప్రచారం చేసినా ఆశించిన ప్రయోజనాలు రాలేదు. భైంసా మున్సిపాల్టీని ఎంఐఎం కైవసం చేసుకుంది. ఆపార్టీ సంప్రదాయ ముస్లిం మైనార్టీల ఓటు బ్యాంకు ఉన్న ప్రాంతాల్లో ప్రభావం చూపింది. జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాల్టీని ఆలిండియా ఫార్వర్డ్‌బ్లాక్‌ కైవసం చేసుకుంది. 36 మున్సిపాల్టీల్లో హంగ్‌ ఏర్పడింది. అక్కడ స్వతంత్ర అభ్యర్థులు కీలకంగా మారారు.

బీఆర్‌ఎస్‌ గట్టిపోటీ
పలు మున్సిపాల్టీలు, మున్సిపల్‌ కార్పొరేషన్లలో అధికార కాంగ్రెస్‌కు ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ గట్టిపోటీ ఇచ్చింది. పట్టణ ప్రాంతాల్లో బీఆర్‌ఎస్‌కు బలమైన ఓటు బ్యాంకు ఉన్నది. అయితే మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతపైనే ఆపార్టీ ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఆరు గ్యారంటీలు, ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఇచ్చిన హామీల అమల్లో వైఫల్యాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లింది. అక్రమ కేసులు, ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో సిట్‌ విచారణ వంటి అంశాలను ప్రజలకు వివరించినా ఆశించిన స్థాయిలో మున్సిపాల్టీలను కైవసం చేసుకోలేదు. ఒక్క మున్సిపల్‌ కార్పొరేషన్‌ను కూడా బీఆర్‌ఎస్‌ దక్కించుకోలేకపోయింది. బీఆర్‌ఎస్‌ హయాంలో మున్సిపాల్టీలు, కార్పొరేషన్లు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఇలా ఏ ఎన్నికలు జరిగినా అన్నీ ఆ పార్టీ ఖాతాలోనే పడేవి. ఇప్పుడు ఆ స్థానాలను నిలబెట్టుకోలేకపోయింది. అయితే కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం బీఆర్‌ఎస్సేనని ఈ ఎన్నికల ఫలితాలతో మరోసారి రుజువైంది.

పోటీ ఉన్నా.. సీఎం వెంటే పట్టణ ఓటర్లు
మున్సిపల్‌ ఎన్నికలను కాంగ్రెస్‌ పార్టీ ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అందుకే పార్లమెంటు నియోజకవర్గాల వారీగా మంత్రులకు ఇన్‌చార్జీ బాధ్యతలను అప్పగించారు. కాంగ్రెస్‌ నాయకులతో సమన్వయంతో పనిచేసి అధిక సంఖ్యలో మున్సిపల్‌, కార్పొరేషన్ల వార్డులను గెలుచుకుంది. అధికారంలో ఉండడం వల్ల ప్రజల్లో సానుకూల వాతావరణాన్ని కల్పించింది. సీఎం రేవంత్‌రెడ్డి ప్రచారం చేయడం, ప్రజలు పలు ప్రభుత్వ పథకాల లబ్ధిదారులుగా ఉండడంతో మెజార్టీ స్థానాలు దక్కాయి.

అయితే అనేక మున్సిపాల్టీల్లో ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌, బీజేపీ, ఇతర పార్టీల నుంచి గట్టి పోటీ ఎదురైంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలు, ఇతర హామీల్లో కొన్ని అమలుకు నోచుకోలేదు. రైతుభరోసా ఇంకా వేయలేదు. దీంతో స్థానికంగా ప్రజల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం పట్ల కొంత వ్యతిరేకత వచ్చింది. సీఎం, మంత్రులు, కాంగ్రెస్‌ నాయకులు సమన్వయంతో ప్రచారం చేయడంతోపాటు పథకాలు, సీట్ల కేటాయింపులో గందరగోళం లేకపోవడం అధికార పార్టీకి కలిసొచ్చిందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -