భూములు ఆక్రమించారంటూ జేడీయే నోటీసులు
2021లోనే జారీ చేసిన అధికారులు
తాజాగా వెలుగులోకి..
ఇటీవల అసెంబ్లీలో కాశ్మీరీలపై భూకబ్జా ఆరోపణలు చేసిన విక్రం రంధావా
జమ్మూకాశ్మీర్ : కాశ్మీరీలు జమ్మూలో జమ్మూ డెవలప్మెంట్ అథారిటీ (జేడీఏ) భూములను ఎక్కువగా ఆక్రమిస్తున్నారని ఆరోపించిన బీజేపీ ఎమ్మెల్యే విక్రం రంధావాకు 2021లో జేడీఏ భూకబ్జా ఆరోపణలపై నోటీసులు జారీ చేసినట్టు సమాచారం బయటపడింది. 2021 జులై 19న జేడీఏ ఆయనకు నోటీసు జారీ చేసిందని తెలిసింది. చక్ గణేశు గ్రామంలోని ఖస్రా నంబర్ 211లో ఎనిమిది కనలాల భూమిని ఆక్రమించి స్టోన్ క్రషర్ ప్లాంటు ఏర్పాటు చేశారని ఆరోపించింది. ఈ నోటీసు జమ్మూ అండ్ కాశ్మీర్ పబ్లిక్ ప్రిమైసెస్ (ఎవిక్షన్ ఎవిక్షన్ ఆఫ్ అనాథరైజ్డ్ ఆక్యుపెంట్స్) చట్టం, 1988 ప్రకారం జారీ అయినట్టు సమాచారం.
ఇప్పుడిది జమ్మూకాశ్మీర్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే బీజేపీ ఎమ్మెల్యే మాత్రం ఈ ఆరోపణలను ఖండించారు. తన క్రషర్ ప్లాంట్ ఖస్రా నంబర్ 212లో ఉందనీ, జేడీయే భూమిలో ఒక్క అడుగు కూడా తాను ఆక్రమించలేదని చెప్పారు. భూమి సరిహద్దుల వివాదం కారణంగా నోటీసు వచ్చిందనీ, తాను చట్టపరమైన సమాధానం ఇచ్చిన తర్వాత జేడీఏ సంతృప్తి చెందినట్టు తెలిపారు. నోటీసు ఉపసంహరించుకున్నదని చెప్పిన బీజేపీ ఎమ్మెల్యే… ఉపసంహరణ పత్రాన్ని మాత్రం చూపకపోవడం గమనార్హం. కాగా జేడీఏ నోటీసులపై బీజేపీ ఎమ్మెల్యేను అధికార, ఇతర విపక్ష పార్టీల ఎమ్మెల్యేలు, నాయకులు ప్రశ్నిస్తున్నారు. విక్రం రంధావా 2024 అసెంబ్లీ ఎన్నికల్లో బహు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.
కాశ్మీరీలపై విక్రం రంధావా ఆరోపణలు
ఇటీవల అసెంబ్లీలో రంధావా మాట్లాడుతూ.. జమ్మూలో 16,112 కనాలాల జేడీఏ భూమి ఆక్రమణకు గురైందని చెప్పారు. అందులో 90 శాతం భూమిని కాశ్మీరీలు ఆక్రమించారని ఆరోపించారు. ఇది జమ్మూ జనాభా సంఖ్యను మార్చే కుట్రగా చెప్పారు. బీజేపీ ఎమ్మెల్యే చేసిన ఈ ఆరోపణలు రాజకీయంగా తీవ్ర చర్చకు దారి తీశాయి. జమ్మూకాశ్మీర్ మంత్రి సకినా మాట్లాడుతూ.. భూకబ్జా ఎవరు చేసినా చట్ట విరుద్ధమేననీ, ప్రతి అంశంలోనూ జమ్మూ-కాశ్మీర్ ప్రాంతీయ విభజన తేవడం మంచిది కాదని చెప్పారు. పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీ (పీడీపీ) ఎమ్మెల్యే వాహీద్ పర్రా బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పార్టీ ద్వేష రాజకీయాలు ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. జమ్మూకాశ్మీర్ ప్రజలకు కేంద్ర పాలిత ప్రాంతం(యూటీ)లో ఎక్కడైనా జీవించే హక్కు ఉందని చెప్పారు. గతేడాది జమ్మూకాశ్మీర్ ప్రభుత్వం అసెంబ్లీలో వెల్లడించిన సమాచారం ప్రకారం.. యూటీలో 20 లక్షల కనాలాలకు పైగా ప్రభుత్వ, అటవీ భూమి ఆక్రమణకు గురైంది.



