Tuesday, February 17, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంనిషేధిత హెచ్‌టీ కాటన్‌, గ్లైఫోసేట్‌లను వాడొద్దు

నిషేధిత హెచ్‌టీ కాటన్‌, గ్లైఫోసేట్‌లను వాడొద్దు

- Advertisement -

రైతుల్లో వాటిపై అవగాహన కల్పించాలి
వ్యవసాయ అధికారుల మానిటరింగ్‌ నిరంతరం ఉండాలి: రైతు కమిషన్‌ చైర్మెన్‌ కోదండరెడ్డి


నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
దేశంలో నిషేదిత హెచ్‌టీ పత్తి విత్తనాలను, గ్లైఫోసేట్‌ రసాయనాలను అస్సలు వాడొద్దనీ, పర్యావరణానికి హాని కలిగించొద్దని రైతులకు తెలంగాణ రైతు కమిషన్‌ చైర్మెన్‌ కోదండరెడ్డి పిలుపునిచ్చారు. నిషేధిత జాబితాలో ఉన్నా రాష్ట్రంలోకి ఎలా వస్తున్నాయని అధికారులను ప్రశ్నించారు. అమాయక రైతులను మోసం చేసి విత్తన కంపెనీలు, డీలర్లు అమ్ముతున్న విషయం కమిషన్‌ దృష్టికి వచ్చిందని తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లోని బీఆర్‌కే భవన్‌లోని రైతు కమిషన్‌ కార్యాలయంలో వ్యవసాయ అధికారులతో కమిషన్‌ సమీక్ష సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో కమిషన్‌ సభ్యులు గోపాల్‌రెడ్డి, కెవీఎన్‌ రెడ్డి, భవానీరెడ్డి, భూమి సునీల్‌, కమిషన్‌ మెంబర్‌ సెక్రెటరీ గోపాల్‌, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు. హెచ్‌టీ కాటన్‌ విత్తనాలు, గ్లైఫోసేట్‌ పురుగు మందు మహారాష్ట్ర నుంచి తెలంగాణకు వస్తున్నట్టు అధికారులు కమిషన్‌ దృష్టికి తెచ్చారు.

నారాయణపేట జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న 96 క్వింటాళ్ల హెచ్‌టీ కాటన్‌ విత్తనాలను పట్టుకున్నామనీ, కేసులు పెట్టిన కూడా మార్పు రావడం లేదని తెలిపారు. ఈ సందర్భంగా కోదండరెడ్డి మాట్లాడుతూ..గ్లైఫోసేట్‌ గడ్డి మందు చల్లడం వల్ల పంట పొలాలు దెబ్బతింటాయనీ, మనుషులకు కూడా లేనిపోని రోగాలొస్తాయని తెలిపారు. కుటుంబ కలహాలతో కొందరు రైతులు ఆవేశంలో గ్లైఫోసేట్‌ గడ్డిమందు తాగి చనిపోయిన సందర్భాలను కూడా ప్రస్తావించారు. నిషేదిత హెచ్‌టీ కాటన్‌, గ్లైఫోసేట్‌ వల్ల పర్యావరణం కూడా దెబ్బతింటుందని తెలిపారు. పర్యావరణాన్ని రక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందనీ, ఈ సీజన్‌కు ముందే హెచ్‌టీ పత్తి విత్తనాలు, గ్లైఫోసేట్‌పై అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -