వ్యవసాయ శాఖపై
సీఎం మొక్కుబడి సమీక్ష : హరీశ్రావు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
వ్యవసాయ శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొక్కుబడి సమీక్ష నిర్వహించారని బీఆర్ఎస్ఎల్పీ ఉపనేత, మాజీమంత్రి టి హరీశ్రావు విమర్శించారు. పంట బోనస్కు కోతలు, రైతన్నకు వాతలు పెట్టేందుకే సమీక్ష నిర్వహించినట్టా?అని ప్రశ్నించారు. పంట బోనస్ నుంచి ప్రభుత్వం తప్పించుకునేందుకు సన్న రకాల సంఖ్యను తగ్గించడం సిగ్గుచేటని మంగళవారం ఒక ప్రకటనలో విమర్శించారు. ఏ రకం ధాన్యం వేయాలని సర్కారు నిర్ణయించడం అంటే రైతన్న మెడపై ప్రభుత్వం కత్తి పెట్టడమేనని తెలిపారు. మ్యానిఫెస్టోలో అన్ని రకాల పంటలకూ రూ. 500 బోనస్ అని, తర్వాత 33 రకాల సన్నాలకు పరిమితం చేశారనీ, ఇప్పుడు దాన్ని ఏడు రకాలకు తగ్గించారని గుర్తు చేశారు. ఇప్పటికే నారు వేసిన రైతుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఇంత నిర్బందంగా, కఠినంగా రైతులతో వ్యవహరించాల్సిన అవసరం ఏముందని అడిగారు. రైతులంటే ఈ ప్రభుత్వానికీ ఎందుకంత కోపమని పేర్కొన్నారు. రైతు బంధు, పంట బోనస్, పంటల బీమా, రైతు బీమా గురించి సమీక్ష చేయకపోవడం అంటే రైతు సంక్షేమాన్ని విస్మరించడమే అవుతుందని తెలిపారు. ఎన్నికలు లేకుంటే రైతు భరోసా ఇవ్వరా?అని ప్రశ్నించారు. ఏడు రకాల సన్నాలకు మాత్రమే బోనస్ ఇస్తామన్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మ్యానిఫెస్టోలో చెప్పినట్టు అన్ని రకాల పంటలకూ పంట బోనస్ చెల్లించాలని కోరారు. గత యాసంగి, ఈ యాసంగి పంటలకు పెండింగ్ పెట్టిన బోనస్ డబ్బులు వెంటనే రైతు ఖాతాల్లో జమ చేయాలని కోరారు.
బోనస్ను పూర్తిగా ఎత్తేసే కుట్ర
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



